ఖైరతాబాద్, నవంబర్ 19 : తెలంగాణలో బీజేపీని నాశనం చేస్తామని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా అడ్డుకుంటామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ మాదిగ మహాసభ ఆవిర్భావం సందర్భంగా సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిడమర్తి రవి మాట్లాడారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో గతంలో జరిగిన మాదిగ యుద్ధభేరి సభలో ప్రస్తుత ఉప రాష్ట్రపతి, అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు రిజర్వేషన్లు అమలు చేస్తామని, వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ నెరవేర్చలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశం ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు.
12శాతంకు తెలంగాణ సర్కార్ తీర్మాణం..
ఉమ్మడి రాష్ట్ర ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఏడు శాతం రిజర్వేషన్లు కావాలని కోరారని, కాని తెలంగాణ ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లకు అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి నివేదించిందని, అయినా బీజేపీ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు.
భవిష్యత్లో బీజేపీ భరతం పడుతాం..
బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని, వంద రోజుల్లో బిల్లు పెడుతామని చెప్పి మభ్యపెట్టారన్నారు. మాదిగల సత్తా మున్ముందు చూపిస్తామన్నారు. భవిష్యత్లో బీజేపీ భరతం పడుతామన్నారు. తమ న్యాయమైన డిమాండ్ 12 శాతం రిజర్వేషన్లు, వర్గీకరణ చేసేంత వరకు ఢిల్లీ ప్రభుత్వంపై ఉద్యమం ఆగదన్నారు.
కాన్షీరాం జయంతికి భారీ బహిరంగ సభ..
వచ్చే ఏడాది కాన్షీరాం జయంతి సందర్భంగా ఇందిరా పార్కు వద్ద తెలంగాణ మాదిగ మహాసభ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, మాదిగ సంఘాలన్నీ కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ మాదిగ సభ అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ, మాదిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గడ్డ యాదయ్య, బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు సురేశ్, మాదిగ జేఏసీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు యాకయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.