బోథ్ : తెలంగాణలోని పురాతన ఆలయాలకు పూర్వ వైభవం కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం బోథ్లోని పంచముఖి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సీమాంధ్రుల పాలనలో దేవాలయాలు వివక్షకు గురయ్యాయన్నారు. గతంలో 33 శాతం భాగస్వామ్యం చెల్లిస్తేనే ఆలయాల కోసం నిధులు మంజూరు చేసేవారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 20 శాతం భాగస్వామ్యం చెల్లిస్తేనే నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారన్నారు. ప్రతీ ఏటా ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నామన్నారు.
దీప, ధూప నైవేద్యాల కోసం ఆలయాలకు నెలనెలా నిధులు కేటాయిస్తున్నామన్నారు. బోథ్లో హనుమాన్ ఆలయ పున: నిర్మాణం కోసం రూ. 22 లక్షలు మంజూరు చేసామన్నారు. మరో రూ 20 లక్షల నిధుల కోసం భాగస్వామ్యం చెల్లిస్తే మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడానికి నిధులు వెచ్చిస్తుందన్నారు.
అనంతరం మంత్రితో పాటు ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి, ఎఎంసీ చైర్మన్ దావుల భోజన్న, పీఏసీఎస్ చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్ సురేందర్యాదవ్, ఆత్మ చైర్మన్ సుభాష్, ఆలయ కమిటీ చైర్మన్ కే విశ్వనాథ్, టీఆర్ఎస్ కన్వీనర్ రుక్మణ్సింగ్, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ ఆలయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పూజలు నిర్వహించారు. పంచముఖి హనుమాన్ విగ్రహా ప్రతిష్టాపన అనంతరం పూజలు చేశారు.