హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సమగ్ర అభివృద్ధి కోసం మహిళా నేతలంతా కలిసికట్టుగా, కుటుంబం వలె పని చేస్తామని స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్ పర్సన్గా ఆకుల లలిత ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ నమ్మకంతో సీఎం కేసీఆర్ మహిళలకు ఇంతటి ప్రాధాన్యత ఇస్తూ..ఈ పదవులు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామన్నారు. లలిత రాజకీయాల్లో అనుభవమున్న నాయకురాలు. గ్రామ స్థాయి నుంచి సమస్యలు తెలిసిన నేత.
మ హిళల సాధికారత సాధించేందుకు సీఎం కేసీఆర్ ఈ సంస్థ చైర్ పర్సన్ గా నియమించారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. మహిళ గర్భంలో ఆడపిల్లగా ఉన్నప్పటి నుంచి వారికి పెండ్లి చేసే వరకు వివిధ కార్యక్రమాల పేరుతో సీఎం కేసిఆర్ వారికి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
వారి భద్రత పట్ల అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఏ నమ్మకంతో ఇంత గొప్ప అవకాశాలు ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తాం. మహిళలకు వృత్తి పరంగా, ఆర్థికంగా ఎదగడానికి శిక్షణ ఇస్తున్నాం. ఈ కార్పొరేషన్ ను మరింత బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు.