న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం సోనియా గాంధీకి ఎలాంటి గౌరవం ఇచ్చామో ఇప్పుడూ అంతే మర్యాద ఉందన్నారు. రాహుల్ గాంధీకి కూడా గౌరవం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందిరా గాంధీ ఫ్యామిలీ, రాజీవ్-సోనియా కుమారుడి పట్ల తనకు ద్వేష భావం లేదన్నారు. వ్యక్తిగతంగా రాహుల్ సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తున్నట్లు ఆజాద్ తెలిపారు. రాహుల్ గాంధీని సక్సెస్ఫుల్ నేతగా మార్చేందుకు ప్రయత్నించామని, కానీ ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదని గులాం నబీ ఆజాద్ అన్నారు.
జీ23 లేఖ ఇవ్వడానికి ఆరు రోజుల ముందు, ఆ తర్వాత తనకు నిద్రపట్టలేదన్నారు. పార్టీ కోసం రక్తాన్ని ధారపోశామన్నారు. ప్రస్తుతం పార్టీలో ఉన్నవారు వ్యర్థులని, తమకు గురించి తెలియని వ్యక్తి పార్టీ ప్రతినధిగా ఉండడం శోచనీయమని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ క్రూరంగా ఉంటాడని అనుకున్నా, కానీ ఆయన మానవత్వాన్ని చాటారని ఆజాద్ అన్నారు.
కొత్త పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత బీజేపీలో చేరుతారా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. కాంగ్రెస్లో చదువుకోని వాళ్ల సంఖ్య పెరిగిందని, కొందరు కేవలం క్లరికల్ వర్క్ కోసం ఉన్నారని, కశ్మీర్లోని బీజేపీ నియోజకవర్గాల్లో తన వల్ల ఒక్క ఓటు కూడా ఆ పార్టీకి పెరగదని, కానీ ఆ పార్టీ వల్ల తనకు ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లు ఆయన చెప్పారు.