హైదరాబాద్ : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.
ఈ నెల 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు సమీక్ష చేశామని, ఇటీవలే ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, ముఖ్య ప్రజా ప్రతినిధులు కలిసి సమీక్ష చేశామన్నారు. వసతుల కల్పన, కరోనా జాగ్రత్తలు, జాతరను విజయవంతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు.
ఈ మేరకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి వివరించారు. భక్తులు జాతరకు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతర మార్గాల్లో భారీ వాహనాలు రాకుండా ఆదేశాలు జారీ చేశామన్నారు.
హనుమకొండ జిల్లా, ఆత్మకూరు మండలం, గుడెప్పాడ్ నుంచి భూపాలపట్నం మార్గంలో ములుగు జిల్లా చివరి వరకు ఈ భారీ వాహనాలు(ఇసుక లారీలు) ప్రయాణించవని, కేవలం భక్తులు, స్థానికుల వ్యక్తిగత, ప్యాసింజర్ వాహనాలు మాత్రమే తిరుగుతాయన్నారు.
ఈ మార్గంలో వచ్చే వాహనాలు చర్ల – కొత్తగూడం – ఖమ్మం – సూర్యాపేట –హైదరాబాద్, మణుగూరు – కొత్తగూడెం – ఖమ్మం – సూర్యాపేట – హైదరాబాద్ మార్గాలకు మళ్లించినట్లు పేర్కొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేందుకు ప్రతి గంటకు ఒకసారి పర్యవేక్షించే విధంగా సిబ్బందిని అధిక సంఖ్యలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్యంలో ఎలాంటి ఫిర్యాదు రాకుండా నిర్వహణ జరపాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.
మేడారంలో భక్తుల వసతులు, సదుపాయాలపై ఎప్పటికప్పుడు భక్తులకు సమాచారం అందించేందుకు వీలుగా సోషల్ మీడియా, యాప్స్, టెక్నాలజిని పూర్తిగా వినియోగిస్తున్నామన్నారు.
గద్దెల వద్ద భక్తులకు ఇబ్బందులు జరగకుండా క్యూలైన్ విధానం పటిష్టంగా రూపొందించామని, భక్తులకు క్యూలైన్ లో అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఎక్కడికక్కడ ఏర్పాటు చేశామన్నారు.
కరోనా జగ్రత్తలు పక్కా పాటించేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని మంత్రి కోరారు. ఏవైనా ఇబ్బందులున్నా వెంటనే అక్కడున్న అత్యవసర నంబర్లకు, సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సాయం పొందాలని కోరారు.