వరంగల్ : తెలంగాణ పోరాట యోధుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
గురువారం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, కడవెండి ముద్దు బిడ్డ, దొడ్డి కొమరయ్య పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. వారిలో దొడ్డి కొమరయ్య మొదటివాడని మంత్రి తెలిపారు. కడవెండిలో సంఘం మీటింగ్ జరుగుతుండగా, రజాకార్లు జరిపిన కాల్పుల్లో కొమరయ్య అమరత్వం పొందాడని మంత్రి గుర్తు చేశారు.
ఆయన పోరాట తత్వం, అలాంటి ఎందరో త్యాగాల స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ తెలంగాణను సాధించాని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నారని ప్రశంసించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మన చరిత్ర, మన సంస్కృతి, మన వైతాళికులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇప్పుడు వాటిని బయటకు తీసే పనిని అనేక మంది నిర్వహిస్తున్నారు. అలా దొడ్డి కొమరయ్య చరిత్ర పై సినిమా తీయడం అభినందనీయమన్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని మంత్రి ఆకాంక్షించారు.
వీఆర్ ఇంటర్నేషనల్.inc పతాకం పై మురళి దర్శకత్వంలో వీరారెడ్డి ప్రముఖ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నిర్మాణ సారథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ను జిల్లాలోని పర్వతగిరి మండలం కల్లెడ గడీలో చిత్రీకరిస్తున్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, సినిమా బృందం, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.