హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పర సహకారంతో పరిషరించుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు. దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో గురువారం ‘బయోటెక్ విప్లవం’ అంశంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బయోటెక్నాలజీ రంగంలో అత్యాధునిక సాంకేతిక శక్తి, ఉద్యోగ కల్పనలో దాని సామర్థ్యంపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అసలు శక్తి సామర్థ్యాలు ఇంకా పూర్తిస్థాయిలో బయటకురాలేదని అన్నారు. సైన్స్కు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఎన్నో సమస్యలకు సులువైన పరిషారం దొరుకుతుందని, మెరుగైన, కచ్చితమైన ఔషధాల తయారీతోపాటు ఆరోగ్య సంరక్షణలో మరిన్ని సురక్షిత పద్ధతులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. వాతావరణ మార్పులకు కచ్చితమైన పరిషారాన్ని చూపే విషయంలో బయోటెక్నాలజీ శక్తిని తకువ అంచనా వేస్తున్నామని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లైఫ్ సైన్సెస్ను డాటా సైన్స్తో సమ్మిళితపరిచి ప్రపంచానికి మెరుగైన ఫలితాలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
కొవిడ్ చెప్పిన విషయాలుఎన్నో
అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, రెగ్యులేషన్ల విషయంలో భారత పాత్రపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కొవిడ్ మనకు ఎన్నో విషయాలు నేర్పిందని అన్నారు. వైద్యరంగంలో ఉన్న మౌలిక సదుపాయాల లోపాలు కొవిడ్తో బయటపడ్డాయని గుర్తుచేశారు. ఇదే సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఔషధాలు, వ్యాక్సిన్ల అనుమతులను వేగవంతం చేసిన సంగతిని ప్రస్తావించారు. పరస్పర సహకారం లేకపోతే సమస్యలు పరిష్కారం సాధ్యం కాదనే విషయాన్ని కొవిడ్ తెలియజేసిందని అన్నారు. సంక్రమించని వ్యాధుల నుంచి వచ్చే ముప్పును పరిషరించడానికి కొవిడ్ మంచి అవకాశం కల్పించిందని చెప్పారు. నాలుగో పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచం లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాలపై దృష్టి పెడుతున్నదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆర్థిక వేదికతో తెలంగాణ ప్రభుత్వం చేతులు కలిపిందని చెప్పారు. ఈ చర్చ నేచర్ ప్రధాన సంపాదకురాలు మగ్దలీనా సిప్పర్ నేతృత్వంలో సాగింది. జింగో బయోవర్స్ సీఈవో జేసన్ కెల్లీ, బెనోవలెంట్ ఏఐ సీఈవో జోవన్నా షీల్డ్స్, నోవో నార్డిస్ ఫౌండేషన్ సీఈవో మాడ్స్ క్రోగ్స్ గార్డ్ థామ్సెన్ తదితరులు పాల్గొన్నారు.
వాస్తవ సమస్యలపై దృష్టిపెట్టాలి
దేశంలోని చాలా పరిశోధన సంస్థలు వాస్తవ ప్రపంచంలోని సమస్యలపై కాకుండా సైంటిఫిక్ జర్నల్స్లో వచ్చే విషయాలపై మాత్రమే దృష్టి పెడుతున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వాస్తవ ప్రపంచం అవసరాలను సైంటిఫిక్ ల్యాబ్లలో జరిగే పరిశోధనలతో అనుసంధానించినప్పుడే ఉద్యోగ కల్పనకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పరిశోధనల ఫలితాలను మారెట్లోకి తీసుకెళ్లగలిగితే దేశ అవసరాలతోపాటు ప్రపంచ అవసరాలు, సమస్యలను తీర్చే శక్తిగా భారతదేశం ఎదుగుతుందని అన్నారు. దేశం ఉరకలెత్తే ఉత్సాహవంతమైన యువతతో నిండి ఉన్నదని, జనాభాలో 27 ఏండ్లకన్నా తక్కువ వయసున్నవారు 50 శాతం, 35 ఏండ్ల కన్నా తక్కువ ఉన్నవారు 65 శాతం ఉన్నారని చెప్పారు. ఈ యువత తీసుకురాగలిగే మార్పును చాలామంది తకువ అంచనా వేస్తున్నారని అన్నారు.