నమస్తే యంత్రాంగం, జూలై 30: కాలం కరుణించింది.. వాన దంచికొట్టింది. వర్షాకాలం మొదలైన రెండు నెలల తర్వాత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకబిగిన పడుతున్న చినుకులు రైతులను మురిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. పలుచోట్ల ఇప్పటికే అలుగులు పోస్తున్నాయి. మరోవైపు, వాగులు, వంకలు ఉప్పొంగడంతో ప్రాజెక్టుల్లోకి వరద వచ్చి చేరుతున్నది. మంజీరా పరవళ్లు తొక్కుతున్నది. ఇక వానాకాలం పంటలకు ఢోకా లేదన్న ఆనందం అన్నదాత ముఖాల్లో వెల్లివిరుస్తున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 75 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. ఒక్క రోజులోనే రెండు టీఎంసీల నీరు చేరింది. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1066.8 అడుగులు(18.444టీఎంసీలు) నిల్వ ఉన్నది. ఇక, నిజాంసాగర్ ప్రాజెక్టుకు దాదాపు 4 వేల క్యూసెక్కుల వరద వస్తున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీ)లకు గాను ప్రస్తుతం 1395.83 అడుగులు (7.46 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది.
మంగళవారం నుంచి మొదలైన వర్షం బుధ, గురువారాల్లోనూ కొనసాగింది. గురువారం పొద్దంతా ఎడితెరిపి లేకుండా కురిసింది. ఎడతెరిపినివ్వక పోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, రోడ్లు నిర్మాణుష్యంగా మారాయి. మరోవైపు, దంచికొడుతున్న వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలాచోట్ల రహదారుల పైకి నీళ్లు చేరాయి. పాత ఇండ్లు నేలకూలాయి. నవీపేట్ మండలం రాంపూర్, పోతంగల్, యంచ గ్రామాల్లో పెంకుటిండ్లు కూలి పోయాయి. ఆర్మూర్లోని హుస్సేనాబాద్ కాలనీలో ఓ ఇల్లు నేలమట్టమైంది. లింగంపేట మండలంలోని పలు గ్రామాలలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్లో మూడు ఇండ్లు నేలకూలాయి.
భారీ వర్షాలతో ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మోర్తాడ్ మండలంలోని పెద్దవాగు, భీమ్గల్లోని కప్పలవాగు జలకళ సంతరించుకున్నది. నిజాంసాగర్ మండలంలో నల్లవాగు మత్తడి ఉధృతంగా ప్రవహిస్తున్నది. లింగంపేట వాగు ఉప్పొంగుతున్నది. బాన్సువాడ మండలంలోని అవాజ్పల్లి మత్తడి, కొల్లూరు వాగు, చెదల వాగులు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు, కొత్త నీటితో మంజీరా పరుగులు పెడుతున్నది. నిజాంసాగర్ మండలంలో నర్సింగ్రావ్పల్లి చౌరస్తా సమీపంలోని నల్లవాగు మత్తడి నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న వరద మంజీరా నదిలో కలుస్తుండడంతో ఆ ప్రాంతమంతా జలకళను సంతరిచుకున్నది. పొతంగల్ మండలంలోని మంజీరా నది జలకల సంతరించుకుంది. నిన్నటి వరకు ఇసుక దిబ్బలతో కనిపించిన నది.. ఇప్పుడు నిండుగా పారుతున్నది.