వరంగల్, నవంబర్ 15 (నమస్తేతెలంగాణ): మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ప్రక్రియ ఈనెల 9న ప్రారంభం కాగా, 18వ తేదీన గడువు ముగియనుంది. 20న లాటరీ పద్ధతిన మద్యం దుకాణాల కేటాయింపు జరగనుంది. దరఖాస్తుకు తక్కువగా ఉన్నదున లిక్కర్ వ్యాపారులు 2019-21లో వైన్షాపుల వారీగా జరిగి మద్యం అమ్మకాలపై దృష్టిసారించారు. ఈసారి ఒక వ్యక్తి ఒక మద్యం దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా చేయవచ్చని, డ్రాలో ఎన్ని వైన్షాపులైనా దక్కించుకోవచ్చని ప్రభుత్వం వెసులుబాటును కల్పించింది. దీంతో లాటరీలో వీటిని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహరచనలు చేస్తు న్నారు.
ఇప్పుడు మద్యం విక్రయాలు భారీగా జరిగిన వైన్షాపులపై చర్చ ఆసక్తి రేపుతోంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలోని 63 మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిన వ్యాపారులకు కేటాయించేందుకు ఎక్సైజ్శాఖ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో 2019-21లో మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగిన వైన్షాపులను దక్కించుకోవటమే లక్ష్యంగా వ్యాపారులు అడుగులు వేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి ఒక మద్యం దుకాణానికి మాత్రమే దరఖాస్తు చేయాలనే నిబంధన ఉండేది. దీంతోపాటు ఒక వ్యక్తికి డ్రాలో ఒక మద్యం దుకాణం దక్కితే మరో మద్యం దుకాణం పొందే అవకాశం లేకపోయేది. ఈ నిబంధనను ప్రభుత్వ ఎత్తేయడంతో తమ పేర పలు మద్యం దుకాణాలకు సాధ్యమైనన్ని దరఖాస్తులు అందజేయటం ద్వారా డ్రాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లిక్కర్ వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. రెండేళ్లలో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగిన వైన్షాపులతోపాటు ఈసారి కొత్తగా ఏర్పాటు చేయనున్న, ఒకే దుకాణం ఉన్న సెంటర్లోని షాపులపైనా మక్కువ చూపుతున్నారు.
ధర్మారం షాప్ నంబర్ వన్
2019 నవంబర్ ఒకటి నుంచి రెండేళ్ల ఎక్సైజ్ విధానం అమల్లోకి వచ్చింది. కరోనా వల్ల ప్రభుత్వం ఒక నెల గడువు ఇచ్చినందున 2019-21 ఎక్సైజ్ పాలసీ ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ప్రస్తుతం వ్యాపారులు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగిన వైన్షాపులపై నజర్ పెట్టినందున ఎక్సైజ్శాఖ 2019-21లో జిల్లాలోని వైన్షాపుల్లో ఆదివారం వరకు జరిగిన మద్యం అమ్మకాలను ప్రకటించింది. ఈసారి పెరిగిన ఏడు వైన్షాపులను పక్కనపెడితే రెండేళ్లలో జిల్లాలో ఉన్న 56 మద్యం దుకాణాల్లో షాపు వారీగా విక్రయాలను పరిశీలిస్తే గీసుగొండ మండలం ధర్మారంలోని మద్యం షాపు టాప్లో ఉంది. అత్యధికంగా రూ.44.59 కోట్ల మద్యం అమ్మకాలతో జిల్లాలోనే నంబర్వన్ స్థానంలో నిలిచింది. రూ. 39.21కోట్ల మద్యం అమ్మకాలతో ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ క్రాస్రోడ్డులోని వైన్షాపు రెండో స్థానంలో ఉంది. చెన్నారావుపేట మండల కేంద్రంలోని రెండోనంబర్ వైన్షాపు రూ.29.18కోట్ల మద్యం అమ్మకాలతో మూడో స్థానం దక్కించుకుంది. రూ.27.80 కోట్ల మద్యం విక్రయాలతో దామెర మండలం దుర్గంపేటలోని వైన్షాపు నాలుగో స్థానం లో నిలిచింది.
గీసుగొండ మండలం మచ్చాపూర్లోని వైన్షాపులో రూ.26.98, కొనాయిమాకుల వైన్షాపులో రూ.26.92, ఖానాపురం మండల కేంద్రంలోని రెండో నంబర్ దుకాణంలో రూ.26.17, పర్వతగిరి లోని రెండోనంబర్ షాపులో రూ.24.48కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్శాఖ అధికారులు వెల్లడించారు. రాయపర్తి మండల కేంద్రంలోని 2వ నంబర్ షాపులో రూ.23.95, సంగెం మండలం కాపులకనపర్తిలోని వైన్షాపులో రూ.23.76, పరకాలలోని 8వ నంబర్ షాపులో రూ.23.37, నర్సంపేటలోని 4వ నంబర్ దుకాణంలో రూ.23.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రకటించారు. ఇలా రెండేళ్లలో వైన్షాపుల వారీగా మద్యం అమ్మకాలను ఎక్సైజ్శాఖ జిల్లా అధికారి కార్యాలయంతోపాటు స్టేషన్లలోని నోటీసు బోర్డుల్లో డిస్ప్లే చేశారు. దీంతో వ్యాపారులు మద్యం విక్రయాలు ఎక్కువగా జరిగిన షాపులపై గురిపెడుతున్నారు.
43 మద్యం షాపులకు దరఖాస్తులు
మద్యం షాపుల కేటాయింపు కోసం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ చేపట్టిన దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు సమీపించింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 18న ముగియనుంది. లిక్కర్ వ్యాపారులు దరఖాస్తులను అందజేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 73 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్శాఖ జిల్లా అధికారి పి.శ్రీని వాసరావు వెల్లడించారు. జిల్లాలోని 63 మద్యం దుకాణాల్లో 43 షాపులకు దరఖాస్తులు వచ్చా యని, సోమవారం వరకు దరఖాస్తుల సంఖ్య 122కి చేరినట్లు ప్రకటించారు. జిల్లాలో ఇంకో 20 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రావాల్సి ఉంద ని, గడువు 18వ తేదీ వరకు ఉన్నందున అన్ని మద్యం దుకాణాలకు వ్యాపారుల నుంచి దరఖా స్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఒక వ్యక్తి ఒక మద్యం దుకాణానికి ఎన్ని దరఖాస్తులైనా అందజేసేందుకు, ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తులు చేసేందుకు ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. చివరి మూడు రోజుల్లో మద్యం దుకాణాల కోసం వ్యాపారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అందజేసే అవకాశం ఉంది.
నర్సంపేట డివిజన్లో 42 దరఖాస్తులు
నర్సంపేట డివిజన్లోని 25 వైన్షాపులకు 42 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సీఐ రామసమ్మయ్య సోమవారం వెల్లడించారు. దరఖాస్తుకు ఈనెల 18 వరకు గడువు ఉందని తెలిపారు. డివిజన్లోని 25 మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు ఆరు, ఎస్సీలకు రెండు, మిగతా 17 షాపులకు ఓపెన్ కేటగిరికి కేటాయించినట్లు తెలిపారు. ఈనెల 20న హన్మ కొండలోని తారాగార్డెన్స్లో కలెక్టర్ సమక్షంలో డ్రా తీయనున్నట్లు చెప్పారు.