రాయపర్తి, నవంబర్ 26 : అరవై ఏళ్ల ఆంధ్రోళ్ల పరిపాలనలో సాగు నీళ్లు కరువై ఏవుసాన్ని పక్కన పెట్టి పొట్ట చేతబట్టుకుని పట్నాలకు వలస పోయిన తెలంగాణ కర్షకుల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మండలంలోని కొలన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జేసీఆర్ దేవాదుల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై కలెక్టర్ గోపితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రుల వివక్షపూరిత పాలనలో తెలంగాణలోని రైతాంగం సాగు నీళ్లు, కరంట్ లేక, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొరతతో నిత్యం ఇబ్బందులు పడేవారని గుర్తు చేశారు. ఆనాడు ఉద్యమ సారధిగా తెలంగాణలో కలియ తిరిగిన సీఎం కేసీఆర్ రైతును రాజు చేయాలన్న గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారని చెప్పారు.
ప్రతి అంగుళం భూమి పచ్చబడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, దేవాదుల నీటితో గ్రామాలకు నూతన శోభ వస్తుందన్నారు. బంగారు పంటలకు రాయపర్తి మండలం వేదికవ్వాలని ఆకాంక్షించారు. తిర్మలాయపల్లి, గన్నారం, జింకురాంతండా, కేశవాపురం, ఎర్రకుంటతండా, ఆరెగూడెం, కొండూరు, కొలన్పల్లి, జయరాంతండా(కే), బురహాన్పల్లి, కాట్రపల్లి, పోతిరెడ్డిపల్లి, వాంకుడోత్తండా, కిష్టాపురం, పన్యానాయక్ తండా, మొరిపిరాల గ్రామాలకు ఎస్సారెస్పీ జలాలు వచ్చే వీలులేనందున కేసీఆర్తో చర్చించి దేవాదుల నీటిని తీసుకువచ్చే పనులు మొదలు పెడుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ కాల్వల నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూ నిర్వాసితులు భూములతో పాటు బావులు, బోర్లు, చెట్లు, కట్టడాలు, గుడిసెలు తదితర వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు.
రైతులు సహకరిస్తే ఈ ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయించి సాగు జలాలను అందించేందకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు, పూస మధు, సర్పంచ్ ఆలకుంట్ల రాజేందర్, ఇరిగేషన్ ఎస్ఈ సీతారాం, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, డీటీ సూర్యానాయక్, గిర్దావర్ కొయ్యాడ చంద్రమోహన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిట్యాల వెంకటేశ్వర్లు, ఇల్లంద మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు నర్సింహాచార్యులు, డైరెక్టర్లు ఎండీ ఉస్మాన్, తోట సుదర్శన్, కుందూరు యాదగిరిరెడ్డి, మండల నాయకులు ఎలమంచ శ్రీనివాస్రెడ్డి, వంగాల నర్సయ్య, తోట నర్సింగం, గజ్జి శ్రీనివాస్, సర్పంచ్లు కర్ర సరిత, గుగులోత్ సుందర్నాయక్, గుగులోత్ బీకోజీనాయక్, చిలుముల ఎల్లమ్మ, సూదుల దేవేందర్రావు పాల్గొన్నారు.
ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు..
పర్వతగిరి : బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా శనివారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళిత, గిరిజన, బడుగు, బలహీన, మైనార్టీల అభ్యున్నతికి బాటలు వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ చింతపట్ల సోమేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.