KCR : వరంగల్ జిల్లా తెలంగాణ చరిత్రకు, వైభవానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టిన ఆయన ఇవాళ వరంగల్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా గొప్పతనాన్ని కొనియాడారు. వరంగల్ మట్టితో, చరిత్రతో తనకు విడదీయరాని బంధం ఉన్నదని చెప్పారు.
కేసీఆర్ ఇంకా ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. ‘42 డిగ్రీల ఎండ ఉన్నా ఇంత భారీ సంఖ్యలో తరలివచ్చిన నా అన్నాతమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లకు నమస్కారం. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నయ్. చాలా చైతన్యం ఉన్న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హనుమకొండ జిల్లా పరిషత్ ఛైర్మన్ సుధీర్ పోటీ చేస్తున్నారు. ఆయనను మీరు భారీ మెజారిటీతో గెలిపించాలె. మీ ఆశీర్వాదాలతో ఆయన పార్లమెంటులో అడుగుపెట్టాలె’ అన్నారు.
‘తెలంగాణ చరిత్రకు వైభవానికి ప్రతీక మన వరంగల్ జిల్లా. నాడు ఉద్యమం జరిగే రోజుల్లో ఓరుగల్లు పోరుగల్లుగా మారితేనే తెలంగాణ వచ్చింది. ఈ మట్టితో, ఈ చరిత్రతో నాది విడదీయరాని బంధం. 1969 నుంచి విరామం ఎరగకుండా, రాజీపడకుండా పోరు చేసిన మన కాళోజీ, మన జయశంకర్ సార్ను తల్చుకుంటే ఉద్వేగభరితమైన ఆవేశం వస్తుంది’ అని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.