కరీమాబాద్, నవంబర్ 9: రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు భూ భాధితుల సమస్య పరిష్కారమైందని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. మంగళవారం రాత్రి శాంతినగర్లోని రాజశ్రీ గార్డెన్లో ఇన్నర్రింగ్ రోడ్డు భూ బాధితుల సమాఖ్య సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇన్నర్రింగ్ రోడ్డు భూ సమస్యకు పరిష్కారం చూపారన్నారు. సమైక్య పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం బిడ్డగా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఇన్నర్రింగ్ రోడ్డు భూ బాధితుల సమాఖ్య సభ్యులను కొంతమంది తప్పుదోవ పట్టించారన్నారు. వారి సమస్యను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించినట్లు తెలిపారు. భూ బాధితులకు నష్టం జరుగకుండాచూసుకుంటానన్నారు. వారికి అండగా ఉండి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. నేటి నుంచి వారికి విడుతల వారీగా పరిహారం చెక్కులు అందజేస్తామన్నారు. టెక్నికల్ సమస్యలు గానీ, ఇతర భూ సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వరంగల్ జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనున్నదని అన్నారు. ఇన్నర్రింగ్ రోడ్డు, రూ. 2వేల కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వంటి అభివృద్ధి పనులతో ఈ ప్రాంతం అగ్రగామిగా నిలువనున్నదని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటుతో భూముల ధరలు పెరుగడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయని తెలిపారు. జిల్లా కార్యాలయాలు సైతం అందుబాటులోకి రానున్నాయన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరుగని అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలో జరుగుతోందన్నారు. సమస్య పరిష్కరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను ఇన్నర్రింగ్ రోడ్డు భూ బాధితుల సమాఖ్య సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే నరేందర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో భూ బాధితుల సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.