వ్యవసాయం.. ఓ జీవన విధానం. రైతును, మట్టిని కలిపి అల్లుకున్న అనుబంధం. ఈ బంధాన్ని మరింత అద్భుతంగా మార్చుకోవాలంటే మూస విధానంకన్నా వినూత్నంగా ‘సాగి’తేనే ఫలితముంటుంది. తీరొక్క పంటలు పండిస్తే అధిక ఆదాయం పొందే అవకాశముంటుంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తేనే మరింత ప్రయోజనం కలుగుతుంది. ముఖ్యంగా యాసంగిలో వరికి బదులు కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర ఆరుతడి పంటలు వేస్తే ఆశించిన మద్దతు ధర దక్కడమే గాక అందరికీ అందుబాటు ధరల్లో ఉత్పత్తులు దొరుకుతాయి. పంటల మార్పిడితో రైతులకు లాభాలు రావడమే గాక భూమికీ మేలు చేకూరుతుంది. ఉమ్మడి జిల్లాలోని నేలలు అన్ని రకాల పంటలకు అనుకూలం కాగా.. వరికి ప్రత్యామ్నాయ పంటలు పండిస్తేనే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం సైతం సూచిస్తున్నది.
వరంగల్, నవంబర్ 9(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అనాదిగా రైతులు అన్ని రకాల పంటలను సొంతంగానే పండించేవారు. అందరి ఆహార అవసరాలకు ఇబ్బంది ఉండేది కాదు. ఇలా పంటల మార్పిడితోనే భూమిలో పోషకాలు పెరిగి రైతుకు ఆదాయం వచ్చేది. కాలక్రమంలో ఆహార పంటల సాగు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా పంట ఉత్పత్తులను కొనుక్కోవాల్సిన పరిస్థితి రావడమే గాక.. బహిరంగ మార్కెట్లో వీటి ధర అంతకంతకూ పెరుగుతోంది. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర సర్కారు ఇటు రైతులకు, వినియోగదారులకు మేలు చేకూర్చాలని నిర్ణయించింది. అందరూ ఒకే పంట కాకుండా.. ఎక్కువ మంది వినియోగించే పంటలు వేయాలని ‘ప్రత్యామ్నాయ’ మార్గం సూచించింది. మిశ్రమ పంటల సాగుతో అన్నదాత ఆదాయం పెరుగడమే గాక, ధరలు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం అంతటా నీటి వసతి పుష్కలంగా ఉన్న నేపథ్యంలో ఏ పంట అయినా వేయవచ్చని చెబుతోంది. డిమాండ్ ఉన్న పంటల సాగు కోసం అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. మిశ్రమ పంటలతో భూమిలోనూ పోషకాలు పెరిగి, ఎరువుల ఖర్చూ తగ్గుతుంది. యాసంగిలో వరికి బదులు మార్కెట్లో డిమాండ్ ఉండే నూనెగింజలు, పప్పులు, కూరగాయలు, పండ్ల తోటలను సాగుచేస్తే ఎక్కువ లాభాలుంటాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని నేలలు అన్ని రకాల పంటల సాగుకు అనువుగా ఉన్నాయి. పత్తి, మిరప, పసుపు, కందులు, పెసలు, నువ్వులు, వేరుశనగ, శనగ, పొద్దుతిరుగుడు, మక్కజొన్న.. వంటి పంటల సాగుకు అనుకూలంగా ఉంటాయి.
కూరగాయలకు ఫుల్ డిమాండ్
సంప్రదాయంగా నేలలను బట్టి యాసంగిలో అనేక పంటలు సాగుచేయవచ్చు. దశాబ్దం క్రితం వరకూ యాసంగిలో అనేక రకాల పంటలు సాగుచేసేవారు. ఎక్కువ మంది వానకాలంలో వరి వేసిన నేలలో యాసంగిలో కూరగాయలు పండించేవారు. వేసవిలోనూ ఇవే పంటలు పండించేవారు. యాసంగిలో నూనెగింజల పంటలు, పప్పులు సాగుచేసేవారు. ఇప్పుడు ఈ పంటలకు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాకేంద్రాలు, మున్సిపాలిటీలు, వరంగల్ నగరంలోని ప్రజల అవసరాలు తీర్చేందుకు కూరగాయలకు బాగా డిమాండ్ ఉంటోంది. ఆరు జిల్లాలోని నేలలు కూరగాయల పంటలకు అనువైనవే. అయితే సాగునీరు పుష్కలంగా ఉండడం వల్ల ఈ పంటలు తగ్గి వరి సాగు పెరిగింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఎప్పటికీ డిమాండ్ ఉన్న కూరగాయలు సాగుచేయడం రైతులకు అన్ని విధాలా మేలు చేస్తుంది. ఉల్లి, టమాట, పచ్చి మిర్చి, వంకాయ, బెండ, క్యారెట్, ఆకుకూరలు, దోస, బీర, అనప, కాకర వంటి ఎన్నో రకాలు సాగుచేసి మంచి ధరలను పొందవచ్చు. ఇవేగాక అలసంద, జొన్న, మక్కజొన్న సాగు చేసుకోవచ్చు. వరి, ఇతర వాణిజ్య పంటలతో పోల్చితే వీటికి పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ.
నూనెల పంటలతో మస్తు లాభం..
నూనెల ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సాగు విస్తీర్ణం తగ్గుతుండడంతో నూనెల గింజల ఉత్పత్తులకు ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలను యాసంగిలో సాగు చేయడం అనువుగా ఉంటుంది. వేరుశనగ పంటల సాగుకు ఎర్ర చెల్క భూములు అనుకూలంగా ఉంటాయి. నవంబరు 15 వరకు ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. ఇప్పుడు అదను మించిపోతే డిసెంబర్ చివరి వారం నుంచి జనవరి మొదటివారం వరకు విత్తనాలు వేయాలి. గరిష్ఠంగా నాలుగు నెలల్లో పంట వస్తుంది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. నువ్వులకు ఇప్పుడు బాగా గిరాకీ ఉంటోంది. వంటలతోపాటు ఆహార పదార్థాల్లో నువ్వుల వినియోగం ఎక్కువైంది. యాసంగిలో నువ్వులు పంట సాగు మంచిదే. ఫిబ్రవరి వరకు విత్తనాలను వేయొచ్చు. మూడు నెలల్లో పంట చేతికి అందుతుంది. ఎకరాకు గరిష్ఠంగా ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పొద్దుతిరుగుడు యాసంగికి అనువైన ఆరుతడి పంట. రెండుమూడు తడులతో మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఎకరాకు ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. ఆవాలు, కుసుములను యాసంగిలో సాగు చేసుకోవచ్చు. ఈ నెలాఖరు వరకు ఆవ విత్తనాలను సాగుచేయాలి. నల్లరేగడి, బరువైన నేలలు ఈ పంటకు అనువుగా ఉంటాయి. నాలుగు నెలల్లో పంట వస్తుంది. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నల్లరేగడి నేలల్లో కుసుమ పంట అనుకూలంగా ఉంటుంది. ఈ నెలాఖరు వరకు సాగుచేసుకోవచ్చు. నాలుగు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఈ పంటకు ఇప్పుడు డిమాండ్ ఉంది. పెట్టుబడి, ఖర్చు తక్కువ.
పప్పుధాన్యాలకు అనువైన సమయం..
ప్రజలకు ఆహారంలో పప్పులు ఎప్పుడూ ఉంటాయి. అన్ని కాలాల్లోనూ వాటికి డిమాండ్ ఉంటుంది. సాగు విస్తీర్ణం తగ్గుతుండడంతో పప్పులకు ధరలు పెరుగుతున్నాయి. కందులు, పెసలు, మినుములు, శనగలను యాసంగిలో సాగు చేసుకోవచ్చు. కందులను అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. మూడున్నర నెలల్లో పంట వస్తుంది. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కందితో పోల్చితే పెసలు, మినుము పంట తక్కువ కాలం ఉంటుంది. నెలన్నర నుంచి రెండున్నర నెలల్లో పంట చేతికి వస్తుంది. వచ్చే నెల వరకు ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. శనగ పంట యాసంగికి అనువైన పంట. నల్లరేగడి భూములు, నీటి వసతి ఉన్న భూములు ఈ పంటలకు అనుకూలంగా ఉంటాయి. నెలాఖరు వరకు పంట వేయవచ్చు. మూడు నెలల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.
మన నేలలు సారవంతం..
వరంగల్ ఉమ్మడి జిల్లాలోని భూములు సారవంతమైనవి. ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందుతోంది. అధిక దిగుబడుల కోసం వినియోగించిన ఎరువులు, పురుగుమందులతో మన భూముల్లో భాస్వరం శాతం పెరుగుతోంది. నేల స్వభావానికి అనువైన పంటలు సాగు చేయాలి. మిశ్రమ పంటల సాగువైపు దృష్టిపెట్టాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వేయాలి. పొట్టివేరు, పొడవు వేరు పంటలను సాగుచేస్తూ పోవాలి. పప్పు దినుసులు, నూనె గింజల పంటల సాగుతో భూములు సారవంతమవుతాయి. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలి.