కీవ్, ఫిబ్రవరి 26: కన్ను మూసినా, తెరిచినా ఎదుటే మృత్యువు. చెవులు చిల్లులు పడే బాంబుల మోత. వీధుల్లో తుపాకుల వేట. దారుల్లో నెత్తుటేర్లు. క్షతగాత్రుల ఆర్తనాదాలు. పసిపిల్లల ఆక్రందనలు. ఆప్తులను కోల్పోయి గుండెలవిసేలా రోదిస్తున్న ప్రజలు. ఎక్కడ చూసినా మృత్యు భయం. ఎక్కడికైనా వెళ్లి కనీసం బతికి ఉందామని ఉన్నదంతా వదిలేసి పారిపోతున్న జనం. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో యుద్ధ రక్కసి ఆడుతున్న వినాశనం ఇది. కీవ్పై పట్టు కోసం రష్యా శనివారం కూడా తీవ్రంగా ప్రయత్నించింది. బాంబుల వర్షం కురిపించింది. రెండు చోట్ల క్షిపణి దాడులు చేసింది. రష్యా బలగాలను ఉక్రెయిన్ దీటుగా ఎదుర్కొన్నది. ఇద్దరి మధ్య భీకర పోరుతో నగరం నెత్తురోడుతున్నది. తొలుత సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తామని ప్రకటించిన రష్యా జనావాసాలపై కూడా దాడి చేస్తున్నది. శనివారం క్షిపణి దాడిలో ఓ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ ధ్వంసం అయింది. దాదాపు 10 మంది చనిపోయారని, వందల మందికి గాయాలయ్యాయని తెలుస్తున్నది. కీవ్ రక్షణ వ్యవస్థను ఛేదించడానికి రష్యా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. కీవ్ వీధుల్లో రష్యా, ఉక్రెయిన్ బలగాలకు మధ్య ముఖాముఖి భీకర పోరు జరుగుతున్నది. పౌరులంతా జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడైనా తలదాచుకోవాలని అధికారులు సూచించారు. కీవ్లో కర్ఫ్యూను పొడిగించారు. దక్షిణ ఉక్రెయిన్లోని మెలిటోపోల్ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్టు రష్యా ప్రకటించింది.
ఉక్రెయిన్, రష్యాలకు తాలిబన్లు హితవు
కాబుల్: రష్యా, ఉక్రెయిన్లు సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అఫ్గానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు సూచించారు. ఉక్రెయిన్లో పౌరుల మరణాలు పెరుగుతుండటంపై అక్కడి అఫ్గాన్ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే దాడులు జరిపి అఫ్గానిస్థాన్ను తాలిబన్లు గతేడాది ఆగస్టులో హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే.