వనపర్తి జిల్లాలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్ బచావో.. ఆందోళన గాంధీభవన్కు చేరింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మాజీ రాష్ట్రపతి మనవడు చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో ఆ జిల్లాలో సీన్ మొత్తం మారిపోయింది. అలంపూర్ గెలుపోటములపై కాంగ్రెస్ పార్టీ ఆశలు వదులుకున్నట్లు
అయింది. రేవంత్ నియెజకవర్గంలో తమను అస్సలు పట్టించుకోవడం లేదని హస్తం పార్టీ నేతలంతా బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారు. జడ్చర్లలో పార్టీ టికెట్ను ముగ్గురు ఆశిస్తున్నారు. దేవరకద్రలో ఇద్దరు నేతలు నాకంటే.. నాకంటూ బహిరంగంగానే చెబుతున్నారు. వీరిద్దరి పంచాయితీ గాంధీభవన్కు చేరింది.
నారాయణపేట జిల్లాలో స్థానికులను కాదని ఇతర ప్రాంతాలకు చెందిన వారిని రంగంలోకి దించే ఆలోచన చేస్తుండటంతో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రాజుకుంటున్నాయి.
కొల్లాపూర్లో సీన్ మారింది. పార్టీలోకి ఓ సీనియర్ నేత వస్తాడన్న ప్రచారంతో స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో వంశీచంద్రెడ్డిపై అక్కడి నేతలు అసంతృప్తి కక్కుతున్నారు. నాగర్కర్నూల్లో ఇవే నా చివరి ఎన్నికలు అని మాజీ నాగం జనార్దన్రెడ్డి చెబుతున్నా.. ఆ పార్టీ నేతలకు కలిసివచ్చేలా కనిపించడం లేదు. ఇక ఎంపీలుగా పోటీ చేయడానికి ఇతర ప్రాంతాల నుంచి నేతలను అద్దెకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని సొంత పార్టీ నేతలు బాహాటంగానే అంటున్నారు. – మహబూబ్నగర్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చిన్నారెడ్డికో హఠావో.. కాంగ్రెస్కు బచావో
ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇవే నా చివరి ఎన్నికలు అంటూ పోటీ చేయడం ఓడిపోవడం.. మల్లా ఎలక్షన్లు రాగానే అదే డైలాగ్ చెబుతున్న మాజీ మంత్రి జీ.చిన్నారెడ్డిపై వనపర్తి కాంగ్రెస్ నాయకులు తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ నేతలంతా కలిసి గాంధీభవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. నేతలు సర్ధి చెప్పడంతో అక్కడే ఓ హోటల్లో సమావేశమై చిన్నారెడ్డికి ఈసారి టికెట్ ఇస్తే ఓడగొడుతామని హైకమాండ్కు అల్టిమేటం జారీ చేశారు. కాదని అతడికే టికెట్ ఇస్తే బీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. నియోజకవర్గంలో చిన్నారెడ్డిని వ్యతిరేకించే వారందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న చిన్నారెడ్డి గత ఎన్నికల్లో మంత్రి నిరంజన్రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోగా.. తనకు రాజకీయాలంటే విసుగొచ్చాయని, ఇక ఎన్నికల్లో పోటీ చేసేది లేదని ప్రకటించారు. అయితే ఆరు నెలలుగా చిన్నారెడ్డి సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కఛాన్స్ అంటూ మళ్లీ తెరమీదకు వచ్చాడు. దీంతో టికెట్పై ఆశలు పెట్టుకున్న నేతలంతా తిరిగబడ్డారు. ఇటీవల పార్టీ అధ్యక్షులను ఎంపిక చేసిన సమయంలోనూ స్థానికులను కాకుండా హైదరాబాద్లో ఉండే వారికి పగ్గాలు అప్పగించారు. దీంతో పార్టీలో అసమ్మతి మరోసారి భగ్గుమన్నది. ఇదిలా ఉంటే ఈ నేతలపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నోటీసులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్లో కాంగ్రెస్లో ఖాళీ
కొడంగల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతున్నది. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ స్థానిక నేతలను పట్టించుకోవడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల సమయంలోనే పలుకరింపులు.. తర్వాత పట్టించుకోవడం లేదని కొందరు హస్తం పార్టీ నేతలు పెదవివిరుస్తున్నారట. ఎలక్షన్లు ముగిసి నాలుగేండ్లయినా రేవంత్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా కూడా రావడం లేదని.. ఆయన టీవీల్లో తప్పా ఎక్కడా కనిపించడం లేదనే సెటైర్లు వేస్తున్నారు. దీంతో చాలా వరకు కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లాలోని నాలుగు నియెజకవర్గాల్లో పార్టీ నేతలకు అసమ్మతి సెగ తగులుతూనే ఉన్నది. కొల్లాపూర్లో సీనియర్ నేత తిరిగి పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకోగా.. నాగర్కర్నూల్లో నాగం జనార్దన్రెడి కొత్త ప్రత్నాలతో తెరమీదికి రావాలని చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ, పాలమూరు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఓడిపోయే నేతలకు టికెట్లు ఎందుకని బహిరంగంగానే నేలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్లో కయ్యాలు ఎక్కువయ్యాయి.
‘చల్లా’ రాకతో ఖంగుతిన్న కాంగ్రెస్
రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మనవడు, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతిన్నారు. గతంలో చల్లా కుటుంబం ఎవరికి మద్దతునిస్తే వారే అలంపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. గతంలో తనకు టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్నే తగలబెట్టిన మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్ సైతం చల్లా ఆశీస్సులతోనే 2014లో ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత ఆయన్ను దూరంగా పెట్టారు. తర్వాత 2018లో చల్లా సైలంట్గా చక్రం తిప్పడంతో గద్వాల జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. అలంపూర్లో అబ్రహం, గద్వాలలో బండ్ల కృష్ణమోహన్రెడ్డికి భారీ విజయం దక్కింది. ఈసారి చల్లా కారెక్కడంతో బీఆర్ఎస్ బలం మరింత పెరిగింది. కాంగ్రెస్ నేతలంతా గులాబీ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు.
దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి
దేవరకద్ర, జడ్చర్ల నియెజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల లొల్లి ప్రారంభమైంది. జీఎంఆర్కు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టగా.. మరో నేత ప్రదీప్గౌడ్ ఇక కాంగ్రెస్ టికెట్ నాకే అంటూ బహిరంగంగా కార్యకర్తల సమావేశాల్లో చెబుతున్నారంట. దీంతో జీఎంఆర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. అయినా బేఖాతరు చేస్తూ పార్టీలో ఒకరికే పదవంటూ తెరమీదకు తీసుకొచ్చారు. మరో నేత ప్రశాంత్రెడ్డి టికెట్ తనకేనంటు దేవరకద్రలో ఏకంగా పార్టీ కార్యాలయాన్నే తెరిచాడు. దీంతో మరో ఇద్దరు నేతలు వారి వారి అనుచరులను కాపాడుకునేందుకు ఎవరికి వారుగా కార్యాలయాలను ఓపెన్ చేశారు. దీంతో పార్టీశ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ఇక జడ్చర్లలోనూ అదే పరిస్థితి నెలకొన్నది. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి మల్లురవికి పోటీగా అనిరుధ్రెడ్డి, ఎర్రశేఖర్ టికెట్ ఆశిస్తున్నారు. మల్లురవి మాత్రం ఇవి భవిష్యత్కు చివరి ఎన్నికలు అంటుండగా.. టికెట్లు మాకే అంటూ మిగితా ఇద్దరూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.