అమీర్పేట, నవంబర్ 22: ప్రపంచానికి ఐటీ హబ్గా మారుతున్న హైదరాబాద్.. మరో సంస్థకు ఆహ్వానం పలుకుతున్నది. దేశంలోనే తొలి వర్చువల్ రియాలిటీ (వీఆర్) టెక్నో పార్కును శంషాబాద్ సమీపంలోని 32 ఎకరాల్లో ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో నెలకొల్పుతున్నట్టు సైమాక్స్ సంస్థ పేర్కొన్నది. సైమాక్స్ చైర్మన్ జీ రాఘవరెడ్డి, సీఈవో మామిడి గౌరీశంకర్ సోమవారం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని, దానికోసం శిక్షణ సంస్థలను నెలకొల్పుతామని తెలిపారు. వీఆర్, ఆగ్మెంటెడ్ రియాల్టీ (ఏఆర్) పరిజ్ఞానాన్ని భవిష్యత్తుకు తగిన విధంగా అందించే వేదికగా నిలుస్తామని వారు పేర్కొన్నారు.
కల్పిత ప్రపంచానికి స్వాగతం
కల్పిత ప్రపంచంలో నిజంగానే విహరించగలిగేలా చేసేదే వర్చువల్ రియాల్టీ. కంప్యూటర్పై కల్పిత ప్రపంచాన్ని సృష్టించి, వాస్తవమైన అనుభుతిని అందించే ఈ టెక్నాలజీతో భౌతికంగా సాధ్యం కాని దాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చు. డిజిటల్, భౌతిక ప్రపంచాల మధ్య హద్దులు చెరిపేసి, నిజమైన ప్రపంచంతో కల్పితాన్ని అనుసంధానం చేస్తుంది. వీఆర్, ఏఆర్ పరికరాలతో మనం ఊహించుకొనే ప్రపంచాన్ని కండ్లతో చూస్తూ ఆ అనుభూతిని, వినోదాన్ని పొందవచ్చు.