హైదరాబాద్: ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు శని, ఆదివారాల్లో (నవంబర్ 6,7వ తేదీలు) ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (స్టేట్ ఈసీ) నిర్ణయించింది. అలాగే, ఈ నెల 27,28 తేదీల్లో కూడా స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. భారత ఎన్నికల సంఘం నవంబర్ 1వ తేదీన 2022 ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. అదే రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఈ నెల 30వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అవసరమైతే కొత్తగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ నెల 6,7, 27, 28 తేదీలు శని, ఆదివారాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లను సీఈఓ ఆదేశించారు. మార్పులు, చేర్పులకు వచ్చిన దరఖాస్తులను డిసెంబర్ 20వ తేదీ వరకు పరిశీలించి, పరిష్కరించాలని నిర్ణయించారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన 2022 సంవత్సరానికి తుది ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. ఈ షెడ్యూల్ మేరకు రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు బాధ్యత తీసుకొని పని చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే, 18 ఏళ్లు నిండినవారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని, ఓటరు జాబితాలో నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు డబుల్ ఓటరుగా నమోదు అయినవారు ఫారం-7 ద్వారా, ఓటరు జాబితాలో తప్పులు సరిచేసుకోవడం కొరకు ఫారం -8 ద్వారా, ఒకే నియోజకవర్గంలో ఇతర అడ్రెస్కు మార్పు చేసుకొనుటకు ఫారం- 8ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, www.ceotelangana.nic.in లేదా www.nvsp.in వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉండి దరఖాస్తు స్వీకరిస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది.