హుజూరాబాద్ : హుజూరాబాద్లో ఎవరు గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓటు వేయాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం హుజూరాబాద్లో మున్నూరు కాపు భవనానికి భూమి పూజ చేసిన అనంతరం మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. హుజురాబాద్ పట్టణ మున్నూరు కాపుల మీటింగ్ చూస్తుంటే.. గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమనిపిస్తోందని, హుజురాబాద్ లో పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనేనని. ఇక్కడ కాంగ్రెస్ లేనేలేదన్నారు. ఓటేసేటప్పుడు బొట్టుబిల్లలు, కుట్టుమిషన్లు, గ్రైండర్ల గురించి ఆలోచించకండని, మీకేమన్నా బిల్లులు రిలీజ్ కావాలంటే నాకొక్క ఫోన్ చేయండని కోరారు.
మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేసే మున్నూరుకాపులు గుండెల మీద చేయేసుకుని చెప్పండి. తెలంగాణ వచ్చాక.. రైతుల బతుకులు మారాయా లేదా అని హరీశ్రావు ప్రశ్నించారు. దేశంలో28 రాష్ట్రాలుంటే.. 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, అక్కడ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా? ఒకవేళ ఇచ్చినట్లు నిరూపిస్తే మేము ఓటు అడగమని సవాలు విసిరారు. ఏడాదికి 12 వేల కోట్లు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తోందని కానీ కేంద్రం మాత్రం… ఎనర్జీ ఆడిట్ చేయమంటోంది. అంటే ఎవరు ఎంత కరెంట్ కాలుస్తున్నారో లెక్కలు తీయమని చెబుతోందని తెలిపారు. మీటర్లు పెట్టి కాల్చుకుంటున్న కరెంట్ లెక్కలు తీయమంటోంది. అలా చేస్తే తెలంగాణ రైతు బతుకుతాడా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
సబ్సిడీ మీద గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఆ డబ్బులు బ్యాంకులో వేస్తామన్నారు. బ్యాంకులో వేసినా ఫర్యాలేదనుకుంటే.. 250 రూపాయలున్న సబ్సీడీ 40కి తగ్గించారన్నారు. సిలిండర్ మాత్రం 410 నుంచి 1000 రూపాయలు చేసారని ఆరోపించారు. రేపు కూడా బాయికాడ మీటర్ పెట్టించి.. బిల్లు ప్రభుత్వమే కడుతుందని చెప్పి.. సిలిండర్ కథే ముందుకు తెస్తారన్నారు. పెట్రోలు, డీజీల్ పెంపుతో రైతులకు దున్నేకూలీపై ఎకరాకు 3వేల భారం పడిందన్నారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని, హుజూరాబాద్ లో పూర్తి కాని ఇండ్లను పూర్తి చేసి త్వరలోనే నిరుపేదలకు అందరికీ అందిస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా మున్నూరు కాపులు సంఘ భవనం కోసం ఈటలను కలిసినా.. గుంట భూమి కూడా ఇవ్వలేదని, ప్రతిసారి ఎన్నికల్లో తమను కనికరిస్తారని మున్నూరు కాపులంతా ఈటలకు ఓటేసారని. ఏడేండ్లుగా మంత్రిగా ఉన్నా ఆయన ఈ పని చేయలేదని ఆరోపించారు. రాష్ట్రానికి అన్నం పెట్టే మున్నూరు కాపుల కోరికను హరీశ్ రావుకు చెప్పగానే ఎకరం భూమి కేటాయించారన్నారు. హుజురాబాద్ మున్సిపాలిటీ మున్నూరు కాపుల కోసం మూడు కోట్ల విలువైన 11 గుంటల భూమితో పాటు, భవనం కోసం కోటి రూపాయలు ఇచ్చిందన్నారు.
సీఎం మున్నూరు కాపుల ఆత్మగౌరవం పెంచేందుకు నాకు మంత్రి పదవి ఇస్తే… ఈటల రాజేందర్ మాత్రం మన గొంతు పిసికే ప్రయత్నం చేసాడన్నారు. గతంలో మనకు భూమి ఉన్నా.. నీళ్లు, కరెంటు లేక సరిగ్గా పంట పండించుకునే పరిస్థితి లేకుండే. ఇప్పుడు 24 గంటల కరెంట్ తో పాటు, సాగునీరు, రైతు బంధు ఇచ్చి మున్నూరు కాపులను ఆదుకున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ నన్ను రెండు సార్లు గెలిపించిన ఘనత హుజురాబాద్ ఓటర్లదని. నేను మంత్రిగా ఉన్నప్పుడు హుజురాబాద్ ను అభివృద్ధి చేసాను. ఆ తర్వాత హుజురాబాద్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వం నిధులిచ్చినా.. మొన్నటిదాకా మంత్రిగా ఉన్న ఈటలరాజేందర్ నిర్లక్ష్యం చేసాడన్నారు. ఉద్యమ సమయంలో లేని ఈటల రాజేందర్.. మధ్యలో పార్టీలోకి వచ్చినా ఆయనకు అనేక కేసీఆర్ అనేక పదవులిచ్చారన్నారు. ప్రతి ఎన్నికల్లో ఈటలను గెలిపిస్తుండటంతో పనిచేయకపోయినా ప్రజలు గెలిపిస్తారన్న భావన ఆయనలో పెరిగిందన్నారు. ఈటల రాజేందర్ అభి వృద్ధి చేసిఉంటే.. మళ్లీ ఇప్పుడు ఇన్ని వందలకోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండే నన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని పార్టీ.. అని పనిచేసే నాయకుని సారథ్యంలో పనిచేయాలని అందరం ఒకే వేదికమీదకు వచ్చామని పెద్దిరెడ్డి ఆన్నారు.
ఇది కూడా చూడండి