టీమ్ఇండియాలో లుకలుకలు తారాస్థాయికి చేరాయా? ఎప్పుడు ఎడమొహం, పెడమొహంగా ఉండే స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ మధ్య భేదాభిప్రాయాలు శృతిమించాయా? ఉప్పునిప్పులా ఉండే ఈ ఇద్దరు ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడేందుకు విముఖత చూపిస్తున్నారా? పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీని ఉన్నఫళంగా తప్పించి రోహిత్కు అప్పగించడం అగ్నికి ఆజ్యం పోసిందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తున్నది. నిప్పు లేనిదే పొగ రాదన్నట్లు ఇన్నాళ్లు నివురు గప్పిన నిప్పులా ఉన్న వ్యక్తిగత విభేదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తున్నాయి. ప్రాక్టీస్లో గాయపడ్డ హిట్మ్యాన్..దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు అందుబాటులో లేకుండాపోతే.. అదే సమయంలో సఫారీలతో వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉండటం లేదని కోహ్లీ బాంబు పేల్చాడు. దీంతో టీమ్ఇండియాలో అసలుఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
విరాట్ కోహ్లీ, రోహిత్శర్మ..ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్లు. ఎవరి శైలి వారిదే. మనసు పెట్టి ఆడారంటే ఆ రోజు ప్రత్యర్థికి చుక్కలే చుక్కలు. సారథ్యంలోనూ ఉద్దండులే. కానీ ఒకే ఒక విషయంలో సారూప్యత కనిపిస్తుంది. ఫార్మాట్తో సంబంధం లేకుండా భారత్కు అద్భుత విజయాలు కట్టబెట్టిన కెప్టెన్లలో కోహ్లీ ఒకడిగా నిలిస్తే..మరోవైపు ఐపీఎల్లో తనేంటో నిరూపించుకున్న నాయకుడు రోహిత్. ద్వైపాక్షిక సిరీస్ల వరకు కోహ్లీ కెప్టెన్సీలో భారత్ వరుస సిరీస్ల్లో విజయపతాకాన్ని ఎగురవేసింది. కానీ ఐసీసీ టోర్నీలకు వచ్చేసరికి సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. మెగాటోర్నీల్లో కోహ్లీ సారథ్యంలో భారత్కు అంత చెప్పుకోదగ్గ విజయాలేమి లేవు. అదే సమయంలో ఐపీఎల్లో రోహిత్..ముంబైకి వరుస టైటిళ్లను అందించాడు. ఇలా కెప్టెన్సీ విషయంలో కోహ్లీ, రోహిత్ మధ్య తేడా పోల్చుకోవడం మొదలైంది. దీంతో టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్..వన్డే, టెస్టులకు నాయకత్వం వహిస్తాననుకున్న తరుణంలో సెలెక్టర్లు రోహిత్ను అనూహ్యంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా పర్యటన ద్వారా కోహ్లీ, రోహిత్ మధ్య లుకలుకలు పతాకస్థాయికి చేరుకున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది.
చెరోదారి
టీమ్ఇండియాలో అగ్రశ్రేణి క్రికెటర్లుగా కొనసాగుతున్న కోహ్లీ, రోహిత్ చెరోదారిలో పయనిస్తున్నారు. ఇన్నేండ్ల కోహ్లీ ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించిన బీసీసీఐ అందుకు అనుగుణంగా పావులు కదుపుకుంటూ వచ్చింది. టీ20 కెప్టెన్సీ విషయంలో వద్దన్నా వినకుండా వీడ్కోలు పలుకడంపై గుర్రుగా ఉన్న బీసీసీఐ పెద్దలు..కనీసం ఒక్క మాట చెప్పకుండా కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తీసేశారు. దీనిపై అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో బోర్డు ఒకింత వెనుకకు తగ్గినట్లు కనిపించింది. కానీ లోపల అలానే ఉంది. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే..ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే..రోహిత్, కోహ్లీ మధ్య ఎడం బాగా పెరిగినట్లు కనిపిస్తుంది. ప్రాక్టీస్ సెషన్లో గాయం కావడంతో ఈనెల 26 నుంచి మొదలయ్యే దక్షిణాఫ్రికా సిరీస్కు హిట్మ్యాన్ పూర్తిగా దూరమయ్యాడు. దీంతో దేశవాళీల్లో దుమ్మురేపుతున్న ప్రియాంక్ పాంచల్కు అవకాశమిచ్చింది.
ఈ కారణంగా కోహ్లీ కెప్టెన్సీలో రోహిత్ టెస్టులు ఆడటం లేదు. ఇక విరాట్ విషయానికొస్తే.. వచ్చే నెల 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతున్నది. సరిగ్గా ఇదే సమయానికి తన గారాల పట్టి వామిక మొదటి పుట్టిన రోజు(జనవరి 11) కోసం వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉండటం లేదని విరాట్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బోర్డుకు తెలియజేసినట్లు సమాచారం. కానీ బీసీసీఐ మాత్రం ఇందుకు విరుద్ధంగా స్పందించింది. ఇప్పటి వరకు కోహ్లీ నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపింది. ఒక వేళ వన్డే సిరీస్ నుంచి తప్పుకోవాలంటే బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జైషా ఇద్దరిలో ఒకరి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఓ అధికారి స్పష్టం చేశాడు. రోహిత్ కెప్టెన్సీలో వన్డేల్లో ఆడటం ఇష్టం లేకనే కోహ్లీ ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. అలాగే కోహ్లీ నాయకత్వంలో రోహిత్ ఆడేందుకు మొగ్గుచూపడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వీరిద్దరి మధ్య సఖ్యత ఎలా కుదుర్చుతాడో అన్నది ఆసక్తికరంగా మారింది.
గతంలో ఇలా లేదు
భారత జట్టులో గతంలోనూ ప్లేయర్ల మధ్య ఇలాంటి వైషమ్యాలు ఉన్నా.. ఎప్పుడు బహిర్గతమైన దాఖలాలు అంతగా లేవు. కపిల్దేవ్-గవాస్కర్, అజారుద్దీన్-సచిన్, గంగూలీ, ద్రవిడ్, ధోనీ, సెహ్వాగ్, గంభీర్ ఇగోలకు పోయినా..ఏనాడు మైదానంలో కనిపించకుండా జట్టును గెలిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. కానీ కోహ్లీ,రోహిత్ విషయానికొస్తే ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నది. సఫారీ పర్యటన ముగించుకుని స్వదేశంలో శ్రీలంకతో జరిగే సిరీస్లోనైనా వీరిద్దరు కలిసి ఆడుతారా అన్నది చూడాలి ఇక.