ముంబై: సుప్రీం కోర్టు ప్రత్యేకంగా నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ(సీవోఏ) మాజీ చీఫ్ వినోద్ రాయ్ సంచలనం రేపారు. 2017-19 వరకు 33 నెలల పాటు బీసీసీఐ పరిపాలన వ్యవహారాలు చూసిన రాయ్ పలు సంచలన విషయాలను వెల్లడించారు. తన పదవీకాలంలో చవిచూసిన పలు విషయాలను ‘నాట్ జస్ట్ ఏ నైట్వాచ్మన్’ అనే పుస్తకంలో పొందుపరిచారు. ఇందులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే మధ్య నెలకొన్న వివాదంతో పాటు మహిళల క్రికెటర్లు ఎదుర్కొన్న సమస్యలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘2006 వరకు దేశంలో మహిళల క్రికెట్ను కనీసం పట్టించుకున్నది లేదు. శరద్ పవార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పురుషుల క్రికెట్తో పాటు మహిళల అసోసియేషన్ కలిపివేయడంతో మార్పులు మొదలయ్యాయి.
అప్పటి వరకు అబ్బాయిల జెర్సీలు కత్తిరించి అమ్మాయిలకు తయారుచేసేవారు. ఈ విషయమై కిట్ స్పాన్సర్ నైకీకి నేను ఫోన్ చేసి ఇప్పటి నుంచి అమ్మాయిలకు ప్రత్యేకంగా జెర్సీలు రూపొందించాలని సూచించాను. దీనికి తోడు వారికి కోచింగ్ సౌకర్యాలు, క్రికెట్ ఉపకరణాలు, వసతి సౌకర్యాలు, మ్యాచ్ ఫీజులు అన్నీ సమకూర్చాలన్నాను. వాళ్లకు సరైన సౌకర్యాలు లేనప్పుడు అంతగా ఆశించడం సరైంది కాదు. 2017 ప్రపంచకప్ తర్వాత అమ్మాయిల క్రికెట్ దశ తిరిగింది’ అని అన్నారు.