బాన్సువాడ, మోస్రా (చందూర్), సెప్టెంబర్ 21: బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా గ్రామాల్లో ఏకగ్రీవ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని గ్రామాల్లోని కుల సంఘాలు తీర్మానం చేస్తున్నాయి. ఏకగ్రీవ తీర్మానం చేసిన ప్రతులను కుల సంఘాల సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులకు అందజేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ ఆభ్యర్థి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి మోస్రా మండల కేంద్రానికి చెందిన గౌడ కుటుంబాలు మద్దతు ప్రకటించాయి.
ఈ మేరకు వంద గౌడ కుటుంబాలు బాన్సువాడకు తరలివెళ్లి స్పీకర్కు గురువారం తీర్మాన కాపీని అందజేశారు. ఈ సందర్భంగా మోస్రాను నూతన మండలంగా ఏర్పాటు చేసి, కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని కొనియాడారు. తాము పోచారం వెంటే ఉంటామని, ఇతర పార్టీల వారు ఓట్లు అడగడానికి తమ సంఘ సభ్యుల వద్దకు రావొద్దని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పిట్ల ఉమా, రైతుబంధు సమితి మోస్రా మండల కన్వీనర్ పిట్ల శ్రీరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు హన్మంత్ రెడ్డి, కార్యదర్శి వంగ సాయాగౌడ్ , గౌడ సంఘం పెద్దలు నర్సాగౌడ్, గంగాధర్ గౌడ్, వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.