ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఉపాధిహామీ పనులపట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం, మంచాల ఉపాధిహామీ సిబ్బందితో పనులపై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధిహామీ పనులు సక్రమంగా కల్పించటంతో పాటు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. ఈ పనులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఉద్ఘాటించారు. ఉపాధిహామీ పనుల్లో ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పీడీ ప్రశాంత్, జడ్పీసీఈవో దిలీప్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, ఏపీడీ చక్రియానాయక్, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మండల పరిధిలోని పోచారం గ్రామంలో వందల ఏండ్ల చరిత్ర కలిగిన గడికోటను సర్పంచ్ అరుణమ్మ భర్త నరేందర్ నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలుసుకుని ఆయన పోచారంలో పర్యటించారు. దీనిపై విచారణ జరిపేందుకు తహసీల్దార్, సీఈవోలతో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. వారం రోజుల్లో ఈ గడికోట అక్రమాలపై విచారణ జరపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో దిలీప్కుమార్, డీఆర్డీఏ పీడీ ప్రశాంత్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో క్రాంతికిరణ్, ఎంపీపీ కృపేశ్ తదితరులున్నారు.