రూ.400లకే ఎకరానికి సరిపడ
జిల్లాలో 6వేల ఎకరాల కూరగాయల సాగు లక్ష్యం
ఏడాది పొడవునా అందుబాటులో నారు
మేడ్చల్, డిసెంబర్27: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. వరికి బదులు ఇతర పంటలు సాగు చేసేలా ఊరూరా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉండటంతో మార్కెటింగ్కు అనుకూలంగా ఉంటుందని, కూరగాయలను సాగు చేసి వరి కంటే రెట్టింపు ఆదాయం పెంచుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. కూరగాయల సాగుకు జిల్లాలోని భూములు అనుకూలంగా ఉన్నట్లు ఇటీవలే వ్యవసాయశాస్త్ర వేత్తలు సూచించారు. ఇప్పటికే హైదరాబాద్కు మేడ్చల్ జిల్లా నుంచే పెద్దఎత్తున కూరగాయలు వస్తున్న విషయం తెలిసిందే. కూరగాయల పంటకు అవసరమయ్యే నారును కూడా రైతులకు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.
రూ.400లకే ఎకరాకు సరిపడ నారు..
ప్రభుత్వ ఆదేశాల మేరకు కూరగాయలు సాగు విస్తీర్ణం పెంచేలా ఉద్యాన శాఖ రూపొందించిన ప్రణాళిక అమలుకు అధికారులు కృషి చేస్తున్నారు. కూరగాయలను పండించేందుకు ముందుకు వచ్చే రైతులకు ఇచ్చేందుకు పలు రకాల కూరగాయల నారును కూడా సిద్ధం చేసింది. రూ.400 చెల్లిస్తే ఎకరానికి సరిపడే నారును అందిస్తారు. కూరగాయల సాగుతో రైతులు ఎక్కువ లాభాలు గడించే విధంగా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. యాసంగికే కాకుండా ఏడాది పొడువునా కూరగాయల నారును రైతులకు అందించనున్నారు.
కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహం
ప్రభుత్వ ఆదేశాల మేరకు కూరగాయలు పండించే రైతులకు ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తున్నది. మేడ్చల్ జిల్లాలో కూరగాయలు పండిస్తే మార్కెటింగ్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రావు. రూ. 400 చెల్లిస్తే ఎకరాకు కావాల్సిన నారును అందిస్తాం. ఏడాది పొడువునా కూరగాయల నారు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. కూరగాయలు పండించే పద్ధతులపై ఉద్యాన శాఖ పలు సూచనలు, సలహాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటుంది. -కె.నీరజ గాంధీ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి