ఝరాసంగం : దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ఛైర్మెన్ చంద్రశేఖర్తో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఝరాసంగం మండల వీరశైవ లింగాయత్ సమాజ్ అధ్యక్షులు రవిపాటిల్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో కొంతమంది అనధికారిక పూజారులు ఆలయ నిబంధనలు పాటించకుండా భక్తులతో పూజలు చేయించి అందిన కాడికి దండుకుంటున్నారన్న విషయం ఛైర్మన్ దృష్టికి వచ్చిందని చెప్పారు.
ఈ విషయంపై ఛైర్మన్ ఆరా తీస్తుంటే ఓ అనధికారిక పూజారి అడ్డగోలుగా మాట్లాడుతూ దురుసుగా ప్రవర్తించాడని, ఇది హేయమైన చర్య అని పాటిల్ అన్నారు. ఆలయ ఈవో సమక్షంలో అడ్డగోలుగా మాట్లాడితే కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా హాస్యాస్పదమని విమర్శించారు. ఇకపైన ప్రతి పూజ రసీదు రూపంలోనే జరగాలని రవిపాటిల్ సూచించారు.
సంబందిత ఎండోమెంట్ అధికారులు విచారణచేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావృతమైతే వీరశైవ లింగాయత్ సమాజ్ సహించదని హెచ్చరించారు. ఆయనతోపాటు మండల ప్రధాన కార్యదర్శి ఆండ్ర సంతోష్, కేతకి పాలక మండలి సభ్యులు మల్లికార్జున్ పాటిల్, శివ కుమార్, రాజు, బస్వరాజ్, రుద్రప్ప, బస్వరాజ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.