ధర్మ, అధర్మాలను, కార్య అకార్యాలను యథాతథంగా- ఉన్నదున్నట్లు తెలుసుకోలేని సందిగ్ధ బుద్ధి రాజసమైతే, విపరీత బుద్ధి తామసం. అధర్మాన్ని ధర్మమంటూ, ధర్మాన్ని అధర్మమంటూ మొండిపట్టుదల గల హఠ బుద్ధే తామసం.
నారద ఉవాచ- ధర్మరాజా! హిరణ్యాక్షుని వంటి మహాశూరుని మృతిని జీర్ణించుకోలేక మతి చలించగా మితిమీరి అతిదీనంగా విలపిస్తున్న తన తల్లి దితికి, కోడళ్లకు మనశ్శాంతి చేకూర్చే విజ్ఞాన వైరాగ్యదాయకమైన ‘యమ ప్రేతుబంధు సంవాద’ రూప ‘సుయజ్ఞోపాఖ్యానం’ వివరించి, అంతటితో విరమించక ‘గంతకు తగ్గ బొంత’ అన్నట్లు తన వంతుగా కూడా ఇలా..
కం॥ అజరామర భావంబును
ద్రిజగద్రాజ్యంబు నప్రతిద్వంద్వము దో
ర్విజితాఖిల శాత్రవమును
గజరిపు బలమును హిరణ్యకశిపుఁడు గోరెన్
‘అమ్మా! అఖిల ప్రాణులకు పరతత్త (పరమార్థ) చింతన లేనందువల్లనే తనవారని, పెర (పరాయి)వారనే పాడుబుద్ధి పుడుతుంది. అయిన వారెవరు? కాని వారెవరు? పరిశీలించి చూడగా అంతా పరమాత్మ స్వరూపులు కారా? ఈ స్వ-పర భేదభావమే సకల ఖేద (దుఃఖ)ములకు కారణమైన అజ్ఞానం. అభేదవాదమే నిఖిల మోద (సుఖ)ములకు మూలమైన వేదజ్ఞానం’ అంటూ ‘వాచా వేదాంతం’ వినిపించి ఆ ఇంతుల (స్త్రీల) శోకానికి ఏకైక కారణమైన అజ్ఞానాన్ని పోకార్చాడు హిరణ్యకశిపుడు.
యుధిష్ఠిర మహారాజా! కనక (హిరణ్య)కశిపుడు వెనుక ముందు కానక అమిత విక్రముడైన త్రివిక్రముని (విష్ణువు)తో విక్రమించ దగిన పరాక్రమం తనకు లేదని గ్రహించి వెనువెంటనే శక్తి సముపార్జనకు దురతిక్రమమైన (వ్యర్థం కాని) తపస్సుకు ఉపక్రమించాడు.
కం॥ పరులెవ్వరు? దామెవ్వరు?
పరికింపఁగ నేక మగుట భావింపరు, త
త్పరమజ్ఞానము లేమిని
బరులును నేమనుచుఁ దోఁచుఁ బ్రాణుల కెల్లన్
లోకసామాన్యమైన జరా (వృద్ధాప్య) మరణాలు తనకు సోకరాదని, ఎదురులేని ముల్లోకాల ఏకఛత్ర రాజ్యాధిపత్యం చేకూరాలని, తన ధాటికి నిలిచే సాటివీరులు ఎవరూ ఉండరాదని, తన భుజబలంతో విరోధి (శత్రు) విజయం సాధించగల గజరిపు (సింహ) పరాక్రమం పొందాలని పరితపించాడు. మందరగిరి చరియ (సానువు)లో అరికాలు నేలకు ఆనకుండా కాలి బొటనవ్రేలిపై వంగకుండా నిలబడి, రెండు బాహువులు (చేతులు) పైకెత్తి నింగిపై చూపు నిలిపి బ్రహ్మదేవుని గురించి భయంకరంగా తపస్సు ప్రారంభించాడు.
తన తమ్ముడు హిరణ్యాక్షుని మరణానికి శోకిస్తున్న కుటుంబసభ్యులను ఈ దైత్య ప్రబుద్ధుడు తన సుద్దులు, సుభాషితాలతో ఎలా శాంతపరచాడో చూచాము. ‘చావున కొల్లక డాగవచ్చునే?’- (చావురాకుండా ఏ తావున, ఏ చొప్పున- తీరున, తప్పించుకోగలం?) అంటూ అప్పుడు అంతకుని (యముని)కి వంతపాడుతూ నీతులు వల్లించిన ఈ కుహనా వీతరాగుడే (కపట వైరాగ్యవంతుడే) ‘తన చావు జగత్ప్రళయము’ అన్న చందాన సొంత విషయంలో ఇప్పుడు తనకు అజరత్వం (ముసలితనం లేకుండుట), అమరత్వం (చావు రాకుండుట) ఆకాంక్షిస్తున్నాడు. ఇంతకుమించి ఆత్మవంచన, జగద్వంచన ఉంటుందా? చింతన (మనసు)కు, మాటకు, చేతకు పొంతన లేకుండుటే దుర్జనత్వం! క్షణం క్షణం- అనుక్షణం సందేహానికి ఆస్పదమైన దేహం ఆత్మకాదని, ఆత్మ అజరమని, అమరమని అనుభవం పొందినవాడే మహాజ్ఞాని. దేహాభిమానగ్రస్తుడై పాంచభౌతిక దేహంతో ప్రపంచంలో శాశ్వతంగా జీవించాలనుకోవడం అజ్ఞానమే కాక అసంభవం కూడా! అంతేగాక, దైత్యరాజుది సాత్త్వికమైన దైవీతపస్సు కాదు. దేహాన్ని దారుణంగా హింసిస్తూ చేసే చండప్రచండమైన మొండి బండ తపస్సు. భౌతిక దేహంతో అనంత భోగానుభవానికి, విబుధు (దేవత)లను వేధించి బాధించడానికి చేసే తపస్సు. ఇది తపస్సు కాదు. భగవద్గీత రీత్యా తమస్సు- తమోగుణం! ఎంత నియమ నిష్ఠలతో సాగినా కస్సుబుస్సులతో కూడిన తామస తపస్సు. అందుకే ఎంత వర్చస్సుతో వెలిగినా లభించాల్సిన ఫలం లభించక చివరికి తుస్సుమన్నది.
మూడులోకాలపై దాడి చేస్తూ మలమల మాడుస్తున్న దానవేంద్రుని తపము వేడిని దేవతలు తట్టుకోలేక మూకుమ్మడిగా నాకం (స్వర్గం) విడిచిపెట్టి శోకంతో బ్రహ్మలోకం పరిగెత్తి- ‘దేవదేవా! నీవే మాకు పరమగతి’ అని శరణాగతి చేశారు- ‘పితామహా! ప్రళయం ముంచుకొస్తోంది. ఆ దితి పుత్రుడు అతిదారుణంగా చేస్తున్న తామస తపోనిరతిచే మతి గతి తప్పింది. విశ్వాన్ని విధ్వంసం చేసి తన తపశ్శక్తి చే మరో నూతన విశ్వాన్ని సృజించాలని సంకల్పించాడు. పంకజాసనా! ఇక ఏ మాత్రం శంక వలదు. అబ్జయోనీ! అంతేకాదు, కాలం అనంతం, ఇల-విశ్వం విశాలం. ఆత్మ నిత్యం. ఈ జన్మలో కాకపోయినా మరుజన్మలోనైనా, ఈ యుగంలో కాకపోతే మరోయుగంలో అయినా- ఎప్పటికైనా అజరామరత్వం సాధించి తీరతా. దేవరాజ్యాన్ని, దివ్య రాజ్యాంగాన్ని దిద్దివేస్తా! అవసరం అనిపిస్తే రద్దు కూడా చేస్తా! పుణ్యపాపాలనే ఈ దిక్కుమాలిన నియమాలను పక్కదారి పట్టిస్తా! కల్పాంతంలోనైనా కాలగర్భంలో కలిసిపోయే వైష్ణవాది-వైకుంఠాది పరంధామాలలో, పరమ పదాలలో ఏమున్నది గనక?’ అని అతడు పట్టుదలతో ఉన్నాడు. ఆ దానవభర్త నీ బ్రహ్మపీఠాన్ని, అపార ఐశ్వర్యాన్ని, విజయ విభూతి సుఖ సంపదలను లోకుల, కాకుల పాలు చేసి చికాకులు కలిగించాలని కంకణం కట్టుకొన్నాడు. పితామహా! మీ సర్వశ్రేష్ఠమైన పరమేష్ఠి పీఠం ఆ దుష్టుని హస్తగతమైతే ఇక లోకంలో శిష్టుల మీద కష్టాలనే కులపర్వతాలు కూలి పడినట్లే! ఆర్తత్రాణ పరాయణా! అరవిందాసనా! దీనికి ప్రతీకారం ఆలోచించి మమ్ములను ఆదుకో’ అని ఆదిత్యులు (దేవతలు) ఆపన్నులై సన్నుతి పూర్వకంగా విధాతకు విన్నవించారు. చూడండి, ఆ తామసికుని దృష్టిలో నిత్యధామమైన వైకుంఠం కూడా అనిత్యమూ, నశ్వరమే! ఇది అసురబుద్ధిలోని తమోగుణ ప్రాబల్య ప్రభావం. ధర్మ, అధర్మాలను, కార్య అకార్యాలను యథాతథంగా- ఉన్నదున్నట్లు తెలుసుకోలేని సందిగ్ధ బుద్ధి రాజసమైతే, విపరీత బుద్ధి తామసం. అధర్మాన్ని ధర్మమంటూ, ధర్మాన్ని అధర్మమంటూ మొండిపట్టుదల గల హఠ బుద్ధే తామసం. అజ్ఞానమే దీని స్వరూపం. (సశేషం)
–తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006