Ashika Ranganath | పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’ విడుదల తర్వాత హీరోయిన్ పాత్రల ప్రాధాన్యతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కథలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా కేవలం గ్లామర్కే పరిమితమైన పాత్రలో కనిపించడంతో జాన్వీపై కొందరు నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై తాజాగా కన్నడ నటి ఆషికా రంగనాథ్ స్పందిస్తూ హీరోయిన్లకు అండగా నిలిచారు. సినిమాల్లో మహిళా పాత్రలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై జరుగుతున్న చర్చలో భాగంగా, జాన్వీ కపూర్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన విమర్శలను ఆషికా ఖండించారు. ఒక కథనానికి సంబంధించిన స్క్రీన్షాట్ను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె, హీరోయిన్లను తప్పుబట్టే ధోరణిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు పరిమితంగా ఉండటం కొత్త విషయం కాదని ఆషికా పేర్కొన్నారు. అలాంటి చిత్రాల్లో నటిస్తున్న నటీమణులు కేవలం డబ్బు లేదా క్రేజ్ కోసం మాత్రమే అంగీకరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. హీరోయిన్లను విమర్శించడం ఇప్పుడు ఒక ఫ్యాషన్లా మారిపోయిందని, ముందుగా ఆ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికీ ప్రేక్షకులు గ్లామర్ పాత్రలను ఎక్కువగా ఆదరిస్తారనే నమ్మకంతో సినిమాలు రూపొందిస్తున్న వ్యవస్థను ప్రశ్నించాలని సూచించారు.
సినిమాలో ఒక మహిళా పాత్ర సరిగా రూపుదిద్దుకోకపోయినా, లేదా ఆమెకు తగిన ప్రాధాన్యత లేకపోయినా, దానికి హీరోయిన్ను బాధ్యురాలిని చేయడం సరైన విధానం కాదని ఆషికా స్పష్టం చేశారు.ఒక పాత్ర ఎలా ఉండాలి, దాని పరిధి ఎంత వరకు ఉండాలి అనే విషయాలు రచయితలు, దర్శకుల చేతుల్లో ఉంటాయని చెప్పారు. నటీనటులు తమకు వచ్చిన అవకాశాల మేరకు పాత్రలను పోషిస్తారని, అందువల్ల మహిళా పాత్రల బలహీనతలకు హీరోయిన్లను నిందించడం న్యాయం కాదన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న వాస్తవ పరిస్థితులను వివరిస్తూ, ఒక పెద్ద ప్రాజెక్ట్లో భాగం కావడం వల్ల నటీనటులకు విస్తృత స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆషికా పేర్కొన్నారు. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో తప్పేమీ లేదని, వాటిని కేవలం పారితోషికం లేదా క్రేజ్ కోసమే చేశారని విమర్శించడం సరికాదని చెప్పారు. కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆషికా రంగనాథ్ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు.