న్యూఢిల్లీ : దేశంలో మూడో వేవ్లో పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్ కట్టడికి టీకానే ఏకైక అస్త్రమని పేర్కొంటున్నారు. ప్రస్తుతం పెద్దలకే పరిమితమైన వ్యాక్సిన్ చిన్నారులకు సైతం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం జైడస్ క్యాడిలా, భారత్ బయోటెక్ పిల్లల టీకాలపై పని చేస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అధికారం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు తెలుస్తోంది. జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ను జైకోవ్-డీ (ZyCoV-D) పేరుతో తయారు చేస్తున్నది.
మరో వైపు రాబోయే ఎనిమిది వారాల్లో పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ పూర్తవుతాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకాను ప్రస్తుతం 2-17 ఏళ్ల మధ్య వయస్సున్న పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. జైడస్ కంపెనీ 12-18 సంవత్సరాల పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. 5-12 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించేందుకు యోచిస్తున్నది. అహ్మదాబాద్కు చెందిన ఔషధ సంస్థ జైడస్ క్యాడిలా టీకా రెండో స్వదేశీ వ్యాక్సిన్ కాగా.. తొలి డీఎన్ఏ వ్యాక్సిన్.
మిగిలిన వ్యాక్సిన్లకు ఇది విభిన్నమైంది. బయో టెక్నాలజీ విభాగం.. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్లో భాగంగా సెంటర్స్ నేషనల్ బయోఫార్మా మిషన్ సహకారంతో టీకా అభివృద్ధి చేస్తున్నారు. డీఎన్ఏ- ప్లాసిడ్ ఆధారిత ZyCoV-D మూడు మోతాదుల వ్యాక్సిన్. దీన్ని 2-4 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయొచ్చు. వ్యాక్సిన్ తొలి, రెండో దశ ట్రయల్స్లో మంచి ఫలితాలు కనిపించాయి. టీకాకు అనుమతులు వస్తే సంవత్సరానికి 240 మిలియన్ మోతాదులను తయారీ చేయాలని జైడస్ యోచిస్తున్నది.