హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ‘గడచిన రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు గాడితప్పుతున్నాయి. ఆయన ఆశయాల సాధనకు, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు సార్ స్ఫూర్తితో ముందుకు సాగుదాం’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక తెలంగాణ బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని, ఆస్తిత్వ పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం ఆసన్నమైందని, తెలంగాణ గరిమను, సామాజిక, రాజకీయ అస్తిత్వాన్ని నిరంతరం కాపాడుకోవడమే.. జయశంకర్ సార్కి మనమిచ్చే ఘన నివాళి అని పునరుద్ఘాటించారు.
ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకొన్న కేసీఆర్.. ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. బాల్యం నుంచే తెలంగాణ అస్తిత్వం కోసం, సామాజిక రాజకీయ చైతన్యంతో ఆలోచనలు చేస్తూ, అందుకు తగ్గ భావజాల వ్యాప్తిని కొనసాగించిన నిస్వార్థ మేధావి, తెలంగాణ స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కేసీఆర్ కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని తాను ముందుకు తీసుకుపోయే క్రమంలో తన ఆలోచనలకు దిక్సూచిగా ఆయన నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో తనకు సైద్ధాంతిక మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు.