Car Wash | డెహ్రాడూన్, మే 5: ఉత్తరాఖండ్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఓవైపు ఎండలు మండిపోతుండటంతోపాటు మరోవైపు గత శీతాకాలంలో తక్కువ వర్షపాతం, హిమపాతం నమోదుతో నీటి సంక్షోభం తీవ్రమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నీటితో కార్లను కడుగటంపై నిషేధం విధించింది. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్సింగ్ ధామి శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. అన్ని వర్క్షాపుల్లో నీటితో బదులుగా కార్లను డ్రైవాష్ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
వేసవి కాలంలో ఇప్పటికే రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. డెహ్రాడూన్, నైనిటాల్, చంపావత్ సహా ఆరు నగరాల్లో తీవ్ర నీటి సంక్షోభం నెలకొన్నది. పలుచోట్ల ప్రజలు నీటి ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. 317 గ్రామాలు, 148 పట్టణ ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి అర్వింగ్ హ్యాంకి వెల్లడించారు. హిమనీనదాలతోపాటు రాష్ట్రంలోని పలు ఇతర నదుల్లో కూడా నీటి ప్రవాహం తగ్గింది. ఈ నేపథ్యంలో పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లకు సూచించారు.
మంగళూరు, మే 5: కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతున్నది. నీటి కొరతతో బెంగళూరు ఇప్పటికే అల్లాడుతుండగా, తాజాగా మంగళూరుకు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. నగరానికి ఏకైక నీటి వనరుగా ఉన్న తుంబే రిజర్వాయర్లో నీటి మట్టం భారీగా పడిపోయింది. దీంతో నగరంలో నీటి సరఫరా క్రమబద్ధీకరణ చేపట్టాలని జిల్లా అధికారులు, మంగళూరు నగర కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు శనివారం జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.
నీటి రేషనింగ్ వ్యవస్థలో భాగంగా గృహ వినియోగ అవసరాల కోసం రెండు రోజులకు ఒక్కసారి మాత్రమే నీరు సరఫరా అవుతుందని అధికారులు పేర్కొన్నారు. నీటిని వృథా చేయొద్దని, అవసరమైన మేరకే నీటిని వినియోగించుకోవాలని సూచించారు. గార్డెనింగ్, వాహనాలను కడుగడం, ఇతర అత్యవసరం కాని పనులకు కుళాయి నీటిని వినియోగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మంగళూరు నగరం ఈ విధమైన నీటి సంక్షోభ పరిస్థితి ఎదుర్కోవడం గత ఐదేండ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు.