Mutton Bone -Endoscopy : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు సుమారు నెల రోజుల క్రితం ఓ పెళ్లిలో మటన్(Mutton) తింటూ పొరపాటున ఓ ఎముక మింగేశాడు. ఆహారనాళంలో ఇరుక్కుపోయిన ఆ ఎముక కారణంగా లోపల రంధ్రం పడి తీవ్ర ఇన్ఫెక్షన్ అయింది. ఆ వృద్ధుడు తొలుత నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రి(Kamineni Hospital)కి వెళ్లాడు. అక్కడ ఎండోస్కొపీ చేసిన వైద్యులు ఎముక ఉందన్న విషయాన్ని గుర్తించి.. ఆయనను ఎల్బీనగర్ ఆస్పత్రికి పంపారు. కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాధిక నిట్టల(Radhika Nittala) నేతృత్వంలోని వైద్యబృందం ఎండోస్కొపిక్ ప్రొసీజర్తో ఆ ఎముకను బయటకు తీసింది. ఇందుకు సంబంధించిన వివరాలను డాక్టర్ రాధిక ఇలా వివరించారు.
“ రామన్నపేట మండలం కక్కిరేన్ గ్రామానికి చెందిన 66 ఏళ్ల శ్రీరాములుకు దవడ పళ్లు లేవు. ఈ మధ్య ఒక పెళ్లికి వెళ్లిన ఆయన అక్కడ మటన్ను నమలకుండా నేరుగా మింగేశారు. అలా మింగినప్పుడు దాదాపు 3.5 సెంటీమీటర్ల పొడవున్న ఒక ఎముక ముక్క కూడా లోపలకు వెళ్లిపోయింది. ఆ విషయం ఆయనకు తెలియలేదు. రెండు మూడు రోజుల తర్వాత ఛాతీలో నొప్పి అనిపించింది. స్థానికంగా వైద్యులకు చూపిస్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకొని మందులు ఇచ్చారు. కానీ, శ్రీరాములకు నొప్పి ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఆయన నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి వెళ్లగా.. ఎండోస్కొపీ చేసి, లోపల ఎముక ఇరుక్కుందన్న విషయం చెప్పారు.
శ్రీరాములు అహారనాళంలోంచి తీసిన మటన్ ఎమక
సాధారణంగా ఇలా ఇరుక్కున్న ఎముకలను ఎవరైనా తీసేస్తారు. కానీ, అది ఆహారనాళానికి రంధ్రం చేసింది. దాంతో, అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడి, పుండ్లు కూడా పడ్డాయి. కొంత చీము చేరింది. దానికితోడు ఇదంతా గుండెకు బాగా దగ్గరగా ఉంది. ఎముకను తీసే సమయంలో ఏ కొంత అటూ ఇటూ అయినా.. ఆహారనాళానికి పూర్తిగా రంధ్రం పడి, గుండెకు కూడా ప్రమాదకరంగా మారుతుంది. అందుకని అత్యంత జాగ్రత్తగా ఎండోస్కొపీ ప్రొసీజర్లోనే తొలగించాం. అలా చేయని పక్షంలో అక్కడ పెర్ఫొరేషన్ లాంటి మరిన్ని సమస్యలు వచ్చేవి.
ఎండోస్కోపీ తర్వాత శ్రీరాములుకు చాలా జాగ్రత్తలు చెప్పాం. ఈ పరిస్థితుల్లో అన్నం తింటే మెతుకులు మళ్లీ ఇన్ఫెక్షన్ అయిన పుండ్ల వద్దకు చేరి, అక్కడ ఆగిపోయి మళ్లీ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. అందుకే ఆయనకు కొంతకాలం పూర్తిగా ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పాం. కొబ్బరినీళ్లు, మంచినీళ్ల లాంటివి తీసుకోవాలన్నాం. ఆయన ఇప్పుడిప్పుడే కొద్దిగా జొన్న అన్నం, పెరుగు అన్నం తినగలుగుతున్నారు’ అని డాక్టర్ రాధిక తెలిపారు.
ఏ వయసువారైనా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. పెద్దవయసు వచ్చి, పళ్లు ఊడిపోయిన తర్వాత ఏదైనా సరే బాగా ఉడకబెట్టుకుని, మెత్తగా అయిన తర్వాత మాత్రమే తినాలి. చికెన్, మటన్ ఎముకలను యథాతథంగా తినకూడదు. కానీ ఈ కేసులో శ్రీరాములకు పళ్లు లేకపోవడంతో ఆయన పొరపాటున మింగేశారు. అహారనాళంలో ఇరుక్కున్న ఆ ఎముకను సమయానికి తియ్యకపోతే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. ఆహారనాళానికి రంధ్రం కూడా పెద్దది అయిపోతుంది. చీము కూడా పడుతుంది. అప్పుడు తప్పనిసరిగా మేజర్ సర్జరీ చేయాలి. ఇలా ఒక నెల రోజుల పాటు ఎముక లోపల ఉండిపోవడం ఎప్పుడూ చూడలేదు” అని డాక్టర్ రాధిక నిట్టల వివరించారు.