ఢిల్లీ ,జూన్ 4: కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ , ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (ఈఈపీఎఫ్ఎ) “హిసాబ్ కి కితాబ్” పేరుతో రూపొందించిన ఆరు లఘుచిత్రాలను ప్రారంభించారు. “హిసాబ్ కి కితాబ్” అనేది ఆరు లఘు చిత్రాల శ్రేణి. దీనిని సీఎస్పీ ఈ–గవ్ వాళ్లు.. వారి శిక్షణలో భాగంగా అభివృద్ధి చేశారు. ఇందులో 5 నిమిషాల నిడివి కలిగి ఆరు షార్ట్ ఫిల్మ్ మాడ్యూల్స్ ఉన్నాయి. బడ్జెట్, పొదుపు, బీమా పథకాల ప్రాముఖ్యత, ప్రభుత్వంలోని వివిధ సామాజిక భద్రతా పథకాలు మొదలైనవాటిని గురించి తెలియజేస్తాయి.
అంతేకాదు మోసపూరిత పథకాలకు సామాన్యుడు బలైపోతున్న పరిణామాలను కూడా ఇందులో చూపించారు. పోంజీ వంటి మోసపూరిత పథకాల నుంచి తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా ఆసక్తికరంగా చిత్రీకరించారు. ఈ లఘు చిత్రాలను దేశవ్యాప్తంగా ఇన్వెస్టర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ల కోసం ఈఈపీఎఫ్ఎ, దాని భాగస్వామ్య సంస్థలు ఉపయోగించుకుంటాయి. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన వాటిల్లో అందరికీ ఆర్థిక స్వావలంబన ఒకటని అన్నారు. ఆర్థిక అక్షరాస్యత, విద్యలు.. ఆర్థిక స్వావలంబన, సమగ్ర వృద్ధి, స్థిరమైన సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.