చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస. పనులు లేకపోవడంతో కుటుంబాలు గడువకా ఉద్యోగ వేటలో పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తక్షణమే పని కావాల్సినవారి సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) చెప్తుండటం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అద్దం పడుతున్నది.
న్యూఢిల్లీ, జనవరి 20: దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని తిరుగుతున్నారు. గత నెల డిసెంబర్ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా తెలిపింది. ఇందులో మహిళల సంఖ్యా పెద్ద ఎత్తున ఉన్నట్టు వివరించింది. డిసెంబర్లో 3.5 కోట్ల మంది పని కోసం తీవ్రంగా వెతికారన్న సీఎంఐఈ.. వీరిలో 80 లక్షల మంది మహిళా నిరుద్యోగులే ఉన్నారని స్పష్టం చేసింది. ‘ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది’ అని సీఎంఐఈ పేర్కొంది. కాగా, అంతర్జాతీయంగా నిరుద్యోగుల సంఖ్య 20.7కోట్లు ఉంటుందని ఐఎల్వో తాజా నివేదికలో వెల్లడించింది.
పని కోసం పడిగాపులు
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఏ పనైనా చేసేందుకు సిద్ధంగా 3.5 కోట్ల మంది ఉన్నారని సీఎంఐఈ చెప్పింది. నిరుద్యోగ రేటులో 7.9 శాతంగా ఉన్న వీరికి తక్షణమే ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నది. ఇక ఉద్యోగం చేయాలని ఉన్నా.. అవకాశం రాని నిరుద్యోగులు 1.7 కోట్ల మంది ఉన్నట్టు ఈ సందర్భంగా తమ వారపు విశ్లేషణలో సీఎంఐఈ తెలిపింది. వీరిలో 90 లక్షల మంది మహిళలేనని పేర్కొన్నది. వీరందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను చూపడం కేంద్ర ప్రభుత్వానికి ఓ సవాలేనని వ్యాఖ్యానించింది.
నిరుత్సాహంలో మహిళలు
పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలకు అవకాశాలు ఆశించిన స్థాయిలో లభించడం లేదని సీఎంఐఈ అన్నది. ఈ పరిస్థితి యువతులకు మిక్కిలి నిరుత్సాహంగా ఉన్నట్టు పేర్కొన్నది. ఈ క్రమంలోనే అసలు ఉద్యోగావకాశాలు లేవా?.. లేక ఉద్యోగాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత చేయూత, ప్రోత్సాహం మహిళలకు అందడం లేదా?.. అని ప్రశ్నించింది.