న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశవ్యాప్తంగా 2018-20 మధ్యకాలంలో నిరుద్యోగం కారణంగా 9,140 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. అప్పుల పాలై 16 వేల మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించిన చేదు నిజాలివి. 2018 నుంచి 4.6 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారు. దేశంలో ఉన్న 84% మంది ఆదాయం పడిపోయింది. నిరుద్యోగం 8 శాతానికి పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థపై సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) రిపోర్టు ఇది. ఆకలి సూచీలో ఇండియా అట్టడుగు దేశాల సరసన నిలిచింది. 116 దేశాలకు గాను 101వ స్థానంలో ఉన్నది. కేంద్రంలోని బీజేపీ సర్కారు పాలన ఫలితాన్ని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఎండగట్టిన వైనమిది. దేశానికి ఇది అమృత కాలమని, తమ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఉరుకులు పరుగుల మీద ఉన్నదని చెప్పుకొంటున్న మోదీ సర్కారు అసలు పనితనమిది.
మంచి రోజులు ఎవరికి
2018-20 మధ్యకాలంలో దేశంలో నిరుద్యోగం, అప్పుల పాలై 25 వేల మంది చనిపోయారని బుధవారం కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో వెల్లడించారు. లాక్డౌన్ అమల్లోఉన్న 2020లోనే ఉద్యోగాలు కోల్పోయి 3,548 మంది బలవన్మరణానికి పాల్పడినట్టు చెప్పారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశంలో ‘నిరుద్యోగ ఎమర్జెన్సీ’ ఉన్నదని వ్యాఖ్యానించారు. దీనికి మోదీ ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు. మోదీ విధానాల వల్లే నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు. ‘ఉద్యోగాల్లేక, అప్పుల పాలై ప్రజలు చనిపోతున్నారు.. మంచి రోజులు ఎవరికి వచ్చాయి’ అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం చెప్పుకొంటున్నట్టు ఇది అమృతకాలం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ‘ఇది అమృత కాలం కాదు. దేశానికి చీకటి కాలం. గుడ్డి రాజు మనకు ప్రధానిగా ఉన్నారు’ అని విమర్శించారు.
జీఎస్టీ, నోట్ల రద్దు వల్లే
జీఎస్టీ, డీమానిటైజేషన్ దేశంలో ఉత్పత్తి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని, ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు కఠినమైన లాక్డౌన్ అమలు చేయడం, చిన్న సంస్థలను కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు మోదీ సర్కారు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని, బడ్జెట్ కేటాయింపులే ఇందుకు నిదర్శనమని ఉదహరించారు. మరోవైపు, కేంద్రశాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు.
కేంద్ర శాఖల్లో 8.72 లక్షల ఉద్యోగాలు ఖాళీ
కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్రసింగ్ ఇటీవలే రాజ్యసభలో వెల్లడించారు. 2018 మార్చి నాటికి 6.83 లక్షల ఖాళీలు ఉండగా, 2019 మార్చి నాటికి 8.72 లక్షలకు పెరిగాయని చెప్పారు.
నిరుద్యోగం వల్ల
2018-2,741
2019-2,851
2020-3,548
అప్పుల పాలై
2018-4,970
2019-5,908
2020- 5,213