రష్యా దురాక్రమణ కారణంగా ఉక్రెయిన్లో కొన్నిరోజులుగా బాంబుల మోతలు దద్దరిల్లుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ ప్రాణరక్షణ కోసం ప్రజలు ఆయుధాలపై పడుతున్నారు. సాధారణంగా ఉక్రెయిన్లో ఎవరికినా తుపాకులు కావాలంటే.. వాళ్లు దరఖాస్తు చేసుకున్న రెండు, మూడు వారాలకుగానీ అనుమతి లభించేది కాదు.
కానీ యుద్ధం కారణంగా ఈ ప్రక్రియను చాలా వేగవంతం చేసి రెండు, మూడు రోజుల్లోనే అనుమతులు ఇచ్చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా తుపాకులు అమ్మే షాపుల ముందు క్యూలు కడుతున్నారు. తమ వద్ద ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి మరీ గన్స్ కొంటున్నారు. ఎందుకని ప్రశ్నిస్తే.. తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అని టక్కున సమాధానం చెప్పేస్తున్నారు.
‘‘రష్యా దళాలను అడ్డుకునేందుకు ఏ దేశమూ సైన్యం పంపదు. ఆ విషయం మాక్కూడా తెలుసు. మమ్మల్ని మేమే రక్షించుకోవాలి. అందుకే ఆయుధాలు కొంటున్నా’’ అని ఒక ఉక్రెయిన్ పౌరుడు చెప్పాడు. రష్యా దళాలు దాడి చేస్తే వారిని తానే అడ్డుకుంటానని మరొకరు ధైర్యంగా చెప్పాడు. ఇప్పటికే కీవ్ సహా పలు నగరాలపై రష్యా క్షిపణులు దాడులు చేస్తున్నాయి.
అయితే ఆ దళాలు ఇప్పటికీ ఒక్క నగరాన్ని కూడా స్వాధీనం చేసుకోలేకపోయాయంటేనే.. ఉక్రెయిన్ ఎంతలా ప్రతిఘటిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో తమ తమ కుటుంబాలను, కమ్యూనిటీలను కాపాడుకునేందుకు పౌరులు కూడా తుపాకులు పట్టుకొని సిద్ధమవుతున్నారు. బుధవారం నాడు మరోసారి ఉక్రెయిన్-రష్యా మధ్య చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల అనంతరం యుద్ధ పరిస్థితులపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.