అబుదాబి : టూరిస్ట్ వీసాదారులకు యూఏఈ శుభవార్త చెప్పింది. అన్నిదేశాలకు చెందిన టూరిస్ట్ వీసాదారులను ఈ నెల 30 నుంచి దేశంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఐసీఏ), నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్సీఈఎంఏ) పేర్కొన్నాయి. అయితే, కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించిన ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే అవకాశమని పేర్కొన్నాయి.
ఈ నిర్ణయం గతంలో నిషేధించిన దేశాలు సహా.. అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని, టూరిస్ట్ వీసా కలిగిన ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోగానే పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరని, వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులకు (ఆంక్షలు విధించిన దేశాల నుంచి వచ్చే వారికి) ఇంతకుముందు ఉన్న నిబంధనలు అలాగే కొనసాగుతాయి’ అని తెలిపాయి. ప్రయాణానికి ముందే టూరిస్ట్ వీసాదారులు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను ఐసీఏ వెబ్సైట్, అల్హోస్న్ యాప్లో నమోదు చేసుకోవాలని సూచించాయి.
కొవిడ్ రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్, నైజీరియాతో పలు దేశాల నుంచి యూఏఈ రాకపోకలను నిలిపివేయగా.. ప్రస్తుతం క్రమంగా నిబంధనలను సడలిస్తోంది. ఈ నెల ప్రారంభంలో స్థానిక నివాసితులు దేశంలోకి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన టీకాల జాబితాలో ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, మోడెర్నా, ఫైజర్, సీనోఫార్మ్, సీనోవాక్ ఉన్నాయి.