న్యూఢిల్లీ: గత నెలలో ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామంటూ ప్రకటించడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. దాయాది దేశాలు సడెన్గా ఇలా కాల్పుల విరమణ గురించి మాట్లాడటం ఏంటన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇండియా, పాకిస్థాన్ మధ్య కొన్ని నెలలుగా రహస్య చర్చలు జరుగుతున్నాయని, వీటికి యూఏఈ మధ్యవర్తిత్వం వహించినట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.
గత నెల 26న యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్, భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ తర్వాత చేసిన ప్రకటన కూడా ఈ వార్తలకు ఊతమిస్తోంది. ఇద్దరు నేతలు రెండు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అన్ని ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించినట్లు యూఏఈ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కొన్ని నెలల ముందు నుంచే..
ఇండియా, పాకిస్థాన్ మిలిటరీ చీఫ్లు ఈ ప్రకటన చేసిన మరుసటి రోజే యూఏఈ దౌత్యవేత్త ఇండియాకు వచ్చారు. ఈ ప్రకటనను స్వాగతించారు. నిజానికి గత కొన్ని నెలలుగా దాయాదుల మధ్య రహస్య చర్చల కోసం యూఏఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ అన్నది ప్రారంభమే అని, రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య శాంతి నెలకొనే అనేక చర్యలు చేపట్టబోతున్నట్లు బ్లూమ్బర్గ్ రిపోర్ట్ స్పష్టం చేసింది.
ఇక తర్వాతి దశలో భాగంగా రెండు దేశాలూ తమ రాయబారులను తిరిగి ఆయా దేశాల్లో నియమించనున్నట్లు కూడా ఆ రిపోర్ట్ వెల్లడించింది. 2019లో జమ్ముకశ్మీర్కు ప్రత్యేకహోదా ఎత్తేసిన తర్వాత పాకిస్థాన్ న్యూఢిల్లీ నుంచి తమ రాయబారిని వెనక్కి పిలిచింది. ఇక ఆ తర్వాత రెండు దేశాల వాణిజ్యం, కశ్మీర్కు శాశ్వత పరిష్కారంపై కూడా చర్చించనున్నట్లు ఆ రిపోర్టు తెలిపింది.