న్యూఢిల్లీ, జూన్ 6: మరో రెండు బ్యాంక్లు వడ్డీరేట్లను పెంచాయి. ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్, ప్రైవేట్ రంగ సంస్థయైన కరూర్ వైశ్యా బ్యాంక్లు తమ రుణాలపై వడ్డీరేట్లను పెంచాయి. బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో ఈఎంఐలు మరింత భారంకానున్నాయి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 0.05 శాతం లేదా 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 7.40 శాతానికి చేరుకున్నది. అలాగే ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు పెంచడంతో రుణ రేటు 7.30 శాతం నుంచి 7.35 శాతానికి అందుకున్నది. పెరిగిన వడ్డీరేట్లు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. అలాగే, కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా తన ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్) రేటు 40 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 13.75 శాతానికి చేరుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో పరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్ల పెంచడానికి ముందే ఈ రెండు బ్యాంకులు వడ్డీరేట్లను సవరించడం విశేషం.