చెన్నై, మార్చి 26: తమిళనాడులో ఎలక్ట్రిక్ బైకు పేలి ఇద్దరు చనిపోయారు. మృతులు దురాయ్ వర్మ(49), మోహన ప్రీతి(13) తండ్రీకూతుళ్లు. వెల్లూరు సమీపంలోని అల్లపురంలో ఈ ఘటన జరిగింది. దురాయ్ వర్మ శుక్రవారం రాత్రి ఇంటిలోపలే ఎలక్ట్రిక్ బైకుకు చార్జింగ్ పెట్టి నిద్రపోయారు. రాత్రి సమయంలో అది పేలి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. తప్పించుకోవడానికి మార్గం లేకపోవడంతో ఇద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపేసుకొన్నారు. పొగ ఇల్లంతా దట్టంగా వ్యాపించడంతో ఊపిరాడక ఇద్దరూ ఆ బాత్రూంలోనే మరణించారు. చార్జింగ్ సాకెట్ పాతదని, దాని వోల్టేజీ కెపాసిటీ తక్కువని, షార్ట్ సర్క్యూట్ వల్ల బైక్ పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోవడం ఇదే తొలిసారి కాదు. టెస్లా, హ్యూందాయ్లాంటి దిగ్గజ కంపెనీలకు చెందిన వాహనాలు కూడా పేలిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో, ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవేనా.. అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అయితే డీజిల్, పెట్రోల్ ఇంజిన్లు ఉన్న వాహనాల కన్నా ఎలక్ట్రిక్ బ్యాటరీతో నడిచే వాహనాలు పేలిపోయే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు. చార్జింగ్ ఫుల్ అయినప్పటికీ అలాగే పెట్టి ఉంచడం వల్ల బ్యాటరీల్లో వేడి పెరిగి పేలిపోతున్నట్టు పేర్కొన్నారు. చార్జింగ్ ఫుల్ కాగానే ప్లగ్ను తొలగించాలని సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెరుగుతున్నాయి. వాహనాల్లో వాడే బ్యాటరీలను మరింత సమర్థంగా, శక్తిమంతంగా మార్చేందుకు కంపెనీలు భారీ మొత్తాన్ని వెచ్చిస్తున్నాయి. కొత్తతరం బ్యాటరీలను తయారు చేస్తున్నాయి. ఇప్పటికే వాడుతున్న బ్యాటరీల కోసం అదనంగా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీని అందిస్తున్నాయి. టెస్లా కంపెనీ అయితే బ్యాటరీలు పేలిపోతే ఆ మంటలు వ్యాపించకుండా రక్షణగా అల్యూమినియం ప్లేట్ను ఫైర్ ప్రొటెక్షన్గా ఉపయోగిస్తున్నది.
సంప్రదాయ వాహనాల వల్ల గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న కారణంగా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ బైకులను ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు పెట్టుబడులను సమకూరుస్తున్నాయి. కొనుగోలుదారులకు రాయితీలిస్తున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 10.60 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరో రెండేండ్లలో ఈ సంఖ్య అనేక రెట్లు పెరుగుతుందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.