Green India Challenge | సోలాపూర్ జిల్లా పండరీపురంలో వెలసిన రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి ఆలయం వద్ద తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తులసి మొక్కలను పంపిణీ చేశారు. విఠలేశ్వరుడికి ప్రీతికరమైన తులసి మొక్కలను 10,116 మంది భక్తులకు గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు అందజేశారు. తులసి మొక్కలు భక్తులకు అందించడం ద్వారా ఓ పవిత్ర కార్యంతోపాటు సంత్ తుకారం మహారాజ్ తన అభంగాల్లో చెప్పిన ప్రకృతి నియమాలకు, ప్రకృతి పరిక్షణకు పాటుపడడం సంతోషంగా ఉందని ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ‘వార్కారి’ సంప్రదాయం 13వ శతాబ్ధం నుంచి కొనసాగుతున్నదని.. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తులసీమాలలతో యాత్రగా తొలి ఏకాదశి రోజున పండరీపూర్కి చేరుకుంటారని తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భక్తులకు భక్తిమార్గంతో పాటు ప్రకృతి పచ్చగా ఉండాలంటే మొక్కలు నాటాలనే ఆశయాన్ని గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రయత్నం మహారాష్ట్ర చరిత్రలో అద్భుతమైన ఘట్టమని భక్తులు పేర్కొనడం గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబర్ సంజీవోళ్ల రాఘవ, పూర్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.