హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మంత్రి కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం ఆలయ పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించారు. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో పురాతన ఆలయాలకు టీటీడీ సహకారం అందించాలని కోరారు. రాజకీయ అవసరాల కోసమే బీజేపీ హిందుత్వాన్ని వాడుకుంటున్నదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుల, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారత్ కోరుకుంటున్నదని అన్నారు. ప్రత్యామ్నాయ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో కేంద్ర రాజకీయాల్లో కేసీఆర్ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.