తిరుమల : శ్రీవారి భక్తులకు టీటీడీ సరికొత్త ప్రసాదాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీవారి ధనప్రసాదం పేరుతో చిల్లర నాణేల ప్యాకెట్లతో పాటు పసుపు, కుంకుమను కలిపి అందిస్తున్నది. భక్తులు హుండీలో కానుకలుగా వేసిన నాణేలను తిరిగి భక్తులకే అందజేస్తోంది. స్వామివారికి నిత్యం లభించే హుండీ ఆదాయంలో రూ.10లక్షల నుంచి రూ.20 లక్షల వరకు భక్తులు నాణేల రూపంలో కానుకలు వస్తుంటాయి. ఈ నాణేలను తీసుకునేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో టీటీడీ వద్ద నాణేల నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో చిల్లర నాణేలను నోట్ల రూపంలోకి మార్చుకునేందుకు ధనప్రసాదానికి శ్రీకారం చుట్టింది. తిరుమలలో సామాన్యులు బస చేసే అతిథి గృహాల రిసెప్షన్ కేంద్రాల్లో చిల్లర నాణేలను రూ.100 ప్యాకెట్ల రూపంలో ప్రత్యేక కవర్లలో భక్తులకు అందిస్తున్నారు.
భక్తులు గదికి అద్దెను చెల్లించిన సమయంలో అదనంగా క్యాష్ ఆన్ డిపాజిట్ కూడా చెల్లిస్తుండడంతో.. వారు గదిని ఖాళీ చేసే సమయంలో క్యాష్ ఆన్ డిపాజిట్ను శ్రీవారి ధనప్రసాదం రూపంలో చెల్లించే విధంగా బుధవారం నుంచి ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం రూపాయి నాణేలను ఇస్తుండగా.. రానున్న రోజుల్లో రూ.2, రూ.5 నాణేల ప్యాకెట్లను సైతం అందుబాటులోకి తీసుకురానుంది. ఒక వేళ భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలోనే క్యాష్ ఆన్ డిపాజిట్ను భక్తులకు చెల్లించనున్నారు.