హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పెట్రోల్ బంక్లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మరో రంగంలోకి ప్రవేశించనుంది. డిమాండ్ అధికంగా ఉన్న డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోకి అడుగిడనుంది. ఈ మేరకు సొంత బ్రాండ్ పేరుతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిళ్లను విక్రయించేందుకు ముందుకొచ్చింది. జీవ అనే పేరుతో ‘స్ప్రింగ్ ఆఫ్ లైఫ్’ అనే ట్యాగ్లైన్తో బాటిళ్లను మారెట్లోకి తీసుకొస్తున్నారు. మొదట లీటర్ వాటర్ బాటిళ్లను అందుబాటులోకి తేనున్నారు. త్వరలోనే కార్యాలయాల్లో వినియోగించేందుకు 250 ఎంఎల్ బాటిళ్లను, ఏసీ బస్సుల ప్రయాణికుల కోసం అర లీటర్ బాటిళ్లను ఉత్పత్తి చేయనుంది. ఈ మేరకు ఎంజీబీఎస్ ప్రాంగణంలో సోమవారం ఉదయం 11.30 గంటలకు టీఎస్ ఆర్టీసీ జీవ వాటర్ బాటిళ్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు.
జీవ అంటే తేజస్సు, ప్రకాశం, కాంతి
జీవ వాటర్ బాటిళ్లను ఏసీ బస్సు ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ సంస్థ ఉచితంగా అందించనుంది. బస్టాండ్ స్టాళ్లలో, టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ బాటిళ్లను విక్రయించనుంది. జీవ అంటే తేజస్సు, ప్రకాశం, కాంతి అని అర్థం. ఆ అర్థానికి తగ్గట్టుగానే వాటర్ బాటిల్ను డిజైన్ చేశారు. ప్రస్తుతం మారెట్లో ఉన్న బాటిళ్లకు భిన్నంగా డైమండ్ కట్స్తో బాటిల్ను రూపొందించారు. ఆ డైమండ్ కట్స్ కారణంగా లైటింగ్ పడగానే బాటిల్ మెరుస్తుంది.
ఇతర బ్రాండ్లకు దీటుగా బాటిళ్ల ఉత్పత్తి
డ్రింకింగ్ వాటర్ వ్యాపారంలోని మిగతా బ్రాండ్లకు దీటుగా జీవ వాటర్ బాటిళ్లను టీఎస్ ఆర్టీసీ ఉత్పత్తి చేయనుంది. దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ వాటర్ బాటిళ్లను విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో జీవ పేరుతో మారెట్లోకి తీసుకొస్తున్న స్వచ్ఛమైన తాగునీరు ఎంతో ఆరోగ్యకరమని, ఈ వాటర్ బాటిళ్లను ప్రజలు ఆదరించాలని టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరారు.