హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కార్తీకమాసంలో ప్రసిద్ధ ఆధ్మాత్మిక క్షేత్రాలను దర్శించే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) ప్రత్యేక టూర్ ప్యాకేజీలు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వివిధ క్షేత్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా మొత్తం ఐదు రకాల టూర్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. ఆయా క్షేత్రాల్లో దర్శన ఏర్పాట్లతోపాటు భోజనాలను పర్యాటకశాఖ సమకూ రుస్తుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు వచ్చే నెల 4 వరకు కొనసాగుతాయి. హైదరాబాద్ నుంచి ప్రతి ఆది, సోమ, శుక్రవారాల్లో ఈ బస్సులు నడుపుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
డిమాండ్ను అనుసరించి మిగిలిన రోజుల్లోనూ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ప్యాకేజీ 1లో హైదరాబాద్- వేములవాడ-కొండగట్టు-ధర్మపురి, ప్యాకేజీలో 2లో హైదరాబాద్- కాలేశ్వరం- రామప్ప- వెయ్యి స్తంభాలగుడి- యాదాద్రి- కీసరగుట్ట, ప్యాకేజీ-3లో హైదరాబాద్-అమరావతి-పాలకొల్లు-భీమవరం-ద్రాక్షారామం-సామర్లకోట, ప్యాకేజీ-4లో హైదరాబాద్- అనంతగిరి, ప్యాకేజీ-5లో హైదరాబాద్- బీచ్పల్లి- అలంపూర్ క్షేత్రాలను దర్శించేవీలున్నది.
హైదరాబాద్ నుంచి వేములవాడ, కొండగట్టు, ధర్మపురి క్షేత్రాలకు నడిపే ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.1,500, పిల్లలకు రూ.1,200 చార్జీ వసూలు చేస్తారు. ఈ బస్సు హైదరాబాద్లో ఉదయం 7 గంటలకు బయలుదేరి, అదేరోజు రాత్రి పది గంటలకు తిరిగొస్తుంది. ఉదయం 10.30-11.30 గంటల మధ్య వేములవాడకు, అక్కడినుంచి మధ్యాహ్నం 12.15 గంటలకు కొండగట్టుకు వెళ్తుంది. దర్శనానంతరం కొండగట్టులో భోజనం ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు ధర్మపురి చేరుతుంది. సాయంత్రం 6 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
హైదరాబాద్ నుంచి కాళేశ్వరం, రామప్ప, వెయ్యిస్తంభాల గుడి, యాదాద్రి, కీసరగుట్టకు నడిచే ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.1,950, పిల్లలకు రూ.1,560 చార్జి వసూలు చేస్తారు. ఇది రెండ్రోజుల యాత్ర. హైదరాబాద్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు రాత్రి 8 గంటలకు తిరిగొస్తుంది. తొలుత ఉదయం 5 గంటలకు కాళేశ్వరం, ఉదయం 7 గంటలకు రామప్ప, మధ్యాహ్నం భోజన సమయానికి వరంగల్ చేరుకొంటుంది. వేయిస్తంభాల గుడిలో దర్శనం అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు యాదగిరిగుట్ట, సాయంత్రం 6 గంటలకు కీసరగుట్టకు వెళ్తుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోటకు నడిచే ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.3,900, పిల్లలకు రూ.3,120 చార్జీ వసూలు చేస్తారు. ఇది మూడ్రోజుల యాత్ర. మొదటి రోజు రాత్రి 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు మూడో రోజు ఉదయం 7 గంటలకు తిరిగొస్తుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు రాత్రంతా ప్రయాణించి, మరుసటి రోజు ఉదయం 5 గంటలకు అమరావతి చేరుకొంటుంది. అక్కడి నుంచి పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోటకు వెళ్తుంది. అదేరోజు రాత్రి అక్కడ నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
హైదరాబాద్ నుంచి అనంతగిరికి నడిచే ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.720 చార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్లో ఉదయం 9 గంటలకు బయలుదేరిన బస్సు అదే రోజు రాత్రి 8 గంటలకు తిరిగొస్తుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతగిరికి చేరుతుంది. అనంత పద్మనాభస్వామి ఆలయం దర్శనం అనంతరం, స్థానిక అటవి ప్రాంతాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటలపాటు విశ్రాంతి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
హైదరాబాద్ నుంచి బీచుపల్లి, అలంపూర్కు నడిచే ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.900, పిల్లలకు రూ.720 చార్జీ వసూలు చేస్తారు. హైదరాబాద్లో ఉదయం 8 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 8 గంటలకు తిరిగొస్తుంది. మధ్యాహ్నం 12 గంటల కల్లా బీచుపల్లి చేరుకుంటుంది. అక్కడి కృష్ణ నది ఒడిన ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో దర్శనం ఏర్పాటుచేస్తారు. అక్కడి నుంచి అలంపూర్ వెళ్తుంది. అక్కడ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయంతోపాటు, ఇతర ఆలయాల్లో దర్శనాలుంటాయి. సాయంత్రం 4.30 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.