ప్రైవేటీకరణకు నిరసనగా కార్మిక సంఘాల పిలుపు
మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ కార్మిక విభాగం
సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించిన సంఘాలు
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతాం
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ వెల్లడి
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ బీఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలు పునిచ్చాయి. సమ్మె సన్నాహక సదస్సును ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్లో అన్ని ట్రేడ్ యూనియన్లు నిర్వహించాయి. దీనికి హాజరైన రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్చైర్మన్ బీ వినోద్కుమార్.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. లాభాలతో నడుస్తున్న పీఎస్యూలను కేంద్రం కుట్రపూరితంగా ప్రైవేటీకరణ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని వెల్లడించారు. ప్రైవేటీకరణ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లాభాలతో నడుస్తున్న రైల్వే, బ్యాంకు, ఎల్ఐసీ, పెట్రోలియం సంస్థలను ప్రైవేటీకరించే చర్యలు ఎంతమాత్రం సరికాదని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
ఇన్సురెన్స్ రంగంలో ఎల్ఐసీకి పోటీగా ఎన్నో ప్రైవేటు సంస్థలు వచ్చినా మారెట్లో నిలువలేదని ఉదహరించారు. పెట్రోలియం సంస్థలు బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీలకు పోటీగా అనేక ప్రైవేటు సంస్థటు మారెట్లోకి వచ్చినా నిలువలేకపోతున్నాయని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే సమర్థంగా పని చేస్తున్నాయని ఆచరణలో నిరూపణ అయ్యిందని వెల్లడించారు. ఈ సమ్మెను విజయవంతం చేయాలని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులకు వినోద్ పిలుపునిచ్చారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జీ రాంబాబు యాదవ్, పీఎస్యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వీ దానకర్ణాచారి, రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఎల్ రూప్సింగ్, ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, టీఎన్టీయూసీ, ఏఐయూటీయూసీ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్ఏఎల్, బీహెచ్ఈఎల్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్, ఎయిర్పోర్ట్స్ ట్రేడ్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మద్దతు
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లో సమావేశమైన అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్రావు, ఉపాధ్యక్షుడు ఏ వేణుమాధవ్, కార్యదర్శి భూపెల్లి బాణయ్య, టీ ఉమాకర్, ఎం విజయబాబు పిలుపునిచ్చారు. భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బీకేఎంయూ) కూడా సమ్మెకు మద్దతు ఇచ్చింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రతీఒక్కరు సమ్మెలో పాల్గొనాలని బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు కోరారు.