హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ: ఈ నెల 29న నిర్వహించే తెలంగాణ విజయగర్జన సభకు హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలంలోని దేవన్నపేట వేదికకానున్నది. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది. సభ నిర్వహణ కోసం దేవన్నపేట గ్రామ శివారులో దాదాపు 350 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పార్కింగ్ కోసం సభాస్థలికి ఇరువైపులా దాదాపు 900 ఎకరాల స్థలాన్ని నేతలు పరిశీలించారు. హైదరాబాద్ టు భూపాలపట్నం జాతీయ రహదారి (163)ని ఆనుకొని ఉండటంతోపాటు సభ నిర్వహణ వల్ల వరంగల్, హనుమకొండ సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఈ స్థలాన్ని ఎంపిక చేశారు.
దేవన్నపేట శివారులోని ఖాళీ స్థలాలను బుధవారం చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, మాజీ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు. రైతుల సమ్మతితోనే విజయగర్జన సభ నిర్వహిస్తున్నట్టు దాస్యం స్పష్టంచేశారు. హనుమకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
దేశంలో ఏ పార్టీ ఎక్కడా నిర్వహించని విధంగా సభ నిర్వహించాలనే సంకల్పంతో స్థల పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. స్థలాన్ని నిర్ణయించినప్పటికీ రైతుల సమ్మతి, సహకారంతోనే సభ నిర్వహిస్తామని తెలిపారు. కొందరు రాజకీయ నాయకులు రైతులను రెచ్చగొడుతున్నారని, వారి మాటలను నమ్మవద్దని హితవుపలికారు. ఎవరికీ నష్టం జరుగకుండా సభ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 40 వేల వాహనాల ద్వారా 15 లక్షల మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు తదితరులు పాల్గొన్నారు.