హుజూరాబాద్ : రైతులకు రుణమాఫీ చేసిన టీఆర్ఎస్ వైపు ఉంటారో.. కార్పోరేట్ పెద్దలకు రుణమాఫీ చేసిన బీజేపీ వైపు ఉంటారో హుజూరాబాద్ ఓటర్లు ఆలోచించుకోవాలని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం కమలాపూర్ మండలం మర్రిపల్లి గూడెంలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీజేపీ పార్టీ ఏం ఇచ్చింది లేదు. రైతులకు బావుల కాడా మీటర్లు పెట్టమంటోంది. డిజీల్ ధర, పెట్రోల్ ధర, గ్యాస్ ధర పెంచింది. మన ముఖ్యమంత్రి రైతు బంధు అని ఐదు వేలు ఇస్తున్నారు. అలాంటపుడు ఏ పార్టీ తో మేలు జరుగుతుందో ఆలోచించండి అని ఆయన అన్నారు.ఈ ఎన్నికల హడావుడి 30 వ తేదీ వరకు మాత్రమేనని, ఆ తర్వాత పనులు జరగాలంటే సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారమే నడుస్తుంది. అంతే కాని ఈటల రాజేందర్ వల్ల కాదు. ఆయన గెలిచేది లేదు… పని అయ్యేది లేదని హరీశ్రావు స్పష్టం చేశారు.
విభజన చట్టంలో చెప్పినట్టు కాజీపేట దగ్గర గూడ్స్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి. దానివల్ల మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి, ఏడేళ్ల నుంచి ఎన్ని సార్లు అడిగినా.. ఇవ్వకండా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆలోచించండి. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడు తున్నరు. బీఎస్ ఎన్ ఎల్ లో 50 వేల ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. ఎల్.ఐ.సీ, రైల్వేలు, విమానాశ్రయాలు అమ్ముతున్న రు. ఇలాంటి పార్టీకి ఓటు ఎందుకు వేయాలి. అని ఆయన ప్రశ్నించారు.
ఈ ప్రాంతానికి వరంగల్ దగ్గరగా ఉంది. అందుకే కేటీఆర్ గారు ఐటీ టవర్ తెచ్చారు. ఇక్కడే మెగా టెక్స్ టైల్స్ పార్కు వస్తుంది. దానితో కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 30వ తారీఖున ఓటేయ పోయేటప్పుడు సిలిండర్కు దండం బెట్టాలెనని, బీజేపీని బొందపెట్టాలె..అని హరీశ్రావు పిలుపునిచ్చారు.
రాజేందర్ నన్ను చూసి అన్నీ వచ్చినయ్ అంటున్నడు నిన్ను చూసి కాళేశ్వరం వచ్చిందా.. నిన్ను చూసి రైతు బంధు వ చ్చిందా..నిన్ను చూసి కళ్యాణ లక్ష్మి వచ్చిందా..నిన్ను చూసి కేసీఆర్ కిట్ వచ్చిందా…చెప్పు అని నిలదీశారు. తనకు ఓటు వేయండి అంటున్న బీజేపీ నేత ఈటల రాజేందర్, గ్యాస్ ధర, డిజీల్ ధర తగ్గిస్తవా చెప్పు, నీవు గెలిస్తే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వస్తదా, ఉక్కు ఫ్యాక్టరీ వస్తదా చెప్పు అని హరీశ్ రావు ప్రశ్నించారు.
మరిపెల్లి గూడెం ప్రజలకు చెప్పేది ఒక్కటే గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి. ప్రతీ 15 రోజలకోసారి వస్తా. మీ స్వంత జాగాలో ఇళ్లు కట్టిస్తా…మహిళా భవనం కట్టిస్తా…. దళితబంధు దళితులందరికీ ఇప్పిస్తా.. రెండేళ్లలో ఐదు వేల ఇల్లు కట్టించి చూపిస్తాం. స్వంత జాగా ఉంటే 5 లక్షల నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది.. గ్రామస్తులు లిఫ్ట్ ఇరిగేషన్ రిపేరు చేయాలని అడుగుతున్నరు. కోడ్ ముగిసాక తప్పకుండా బాగు చేయిస్తం అని హరీశ్రావు హమీ ఇచ్చారు.