హనుమకొండ, జనవరి 25 : 60 ఏండ్ల పోరాట పటిమ, కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కలిసొచ్చే రాజకీయ పార్టీలతో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఐక్య ఉద్యమాలు చేపడుతామని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టంచేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకు ఉద్యమానికి సీపీఐ మద్దతు కోరుతూ మంగళవారం హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధనకు చేపట్టనున్న ఐక్య ఉద్యమానికి సంబంధించి ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కాజీపేటలోని ప్యారడైజ్ ఫంక్షన్హాల్లో వివిధ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని అంశాలను అమలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి తెలంగాణ బీజేపీ ఎంపీలు, నాయకులు ఏనాడూ నోరెత్తలేదని మండిపడ్డారు. జాతీయ హోదాకు అన్ని అర్హతలున్న కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టు, మేడారం జాతరను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఢిల్లీలో తిరిగే బీజేపీ నాయకులకు వరంగల్పై ప్రేమ ఉంటే అధిష్ఠానాన్ని ఒప్పించి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కృషి చేయాలని డిమాండ్ చేశారు.