హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): కుటిల రాజకీయాల కోసమే అణగారిన వర్గాలను కేం ద్రం వాడుకుంటున్నదని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టి, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. కుల గణనపై రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసినా, కేంద్రం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో బీసీ కులగణనపై వాయిదా తీర్మానం కోసం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభాపక్షనేత నామా నాగేశ్వర్రావు నోటీసులు ఇచ్చారు.
సభలు ప్రారంభం కాగానే రాజ్యసభలో కే కేశవరావు, లోక్సభలో నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. కులగణన చేపట్టాల్సిందే అంటూ ప్లకార్డులతో రాజ్యసభలో చైర్మన్, లోక్సభలో స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నోటీసులకు ఉభయసభల నుంచి స్పందన లేకపోవడంలో నిరసనగా ఎంపీలు వాకౌట్ చేశారు. అనంతరం తెలంగాణభవన్లో మీడియాతో కే కేశవరావు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం అమలులో కేంద్రం పూర్తిగా విఫలమైందని, రాజ్యాంగబద్ధంగా పాలించే హక్కేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులగణన చేయకపోవటంతో విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లలో బీసీలు అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2018 నాటికి ఓబీసీలు 8.2 శాతమే ఉద్యోగాలు పొందారని తెలిపారు. రైల్వేల్లో 8.05 శాతం, 71 కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 14.94 శాతమే బీసీలకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, యూపీఎస్సీలో 11.43 శాతమే బీసీలకు వాటా దక్కిందని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో 10 శాతమే బీసీలున్నారని కాగ్, నీతి అయోగ్ నివేదికలు చెప్తున్నాయని పేర్కొన్నారు. బీసీ కులాల్లోని వివిధ కులాలకు రాజ్యాంగ బద్ధంగా న్యాయమైన వాటా దక్కాలంటే కులగణన చేపట్టాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
కావాలనే కులగణన చేయడం లేదు: రంజిత్రెడ్డి
కేంద్రం ఉద్దేశపూర్వకంగానే కులగణన చేయటం లేదని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి ఆరోపించారు. కులగణన చేపడితే, అసలు లెకలు బయటకు వచ్చి రిజర్వేషన్లు అమలుచేయాల్సి వస్తుందని, ఆ పని ఇష్టంలేకనే కేంద్రం కులగణనపై వెనక్కు తగ్గుతున్నదని ఆరోపించారు. గంటల తరబడి సభలో కింద కూ ర్చొని తాము ఆందోళన చేస్తే నవ్వడం తప్ప కాంగ్రెస్ ఎంపీలు ఎం చేశారని ప్రశ్నించారు. ధాన్యం సేకరణపై జాతీయస్థాయిలో ఒక విధానం ఉండాలని తాము పట్టుబడితే రాహుల్గాంధీ మద్దతు ఇచ్చిన విషయా న్ని గుర్తుచేశారు. తాము ఆందోళన చేయకపోతే రాహు ల్ ఎలా మద్దతు ఇస్తారని కాంగ్రెస్ ఎంపీలను ప్రశ్నించారు. పంజాబ్లో ధాన్యం సేకరించినట్టే రాష్ట్ర వరిధాన్యాన్ని కొనాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు.
వారికి రైతులపై మాట్లాడే హక్కులేదు: రాములు
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలకు, ఎంపీలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కులేదని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు తేల్చిచెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయంపై రాష్ట్రంలో మాట్లాడే నైతిక హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్కు తప్ప మరెవరికీ లేదని అన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆరేనని చెప్పారు. బీసీకులగణన చేపట్టాలని రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.
కాంగ్రెస్వి దిగజారుడు: మన్నె శ్రీనివాస్రెడ్డి
కాంగ్రెస్వి దిగజారుడు రాజకీయాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. వ్యక్తిగత దూషణలు చేయటమే కాంగ్రెస్, బీజేపీల వ్యవహారంగా మారిందని దుయ్యబట్టారు.అన్ని రాష్ర్టాలను సమానంగా చూసుకోవాల్సిన కేంద్రం ఇష్టానుసారం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
కేంద్రం కుటిల రాజకీయాలు మానుకోవాలి: ఎంపీ నామా
బీసీ కులగణన చేపట్టాలని దేశవ్యాప్తంగా ఉద్యమాలు సాగుతున్నా కేంద్రం పట్టించుకోవటం లేదని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. 2015లో ఓబీసీలకు పార్లమెంట్, అసెంబ్లీ, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపితే ఇప్పటివరకు పట్టించుకోలేదని మండిపడ్డారు. జాతీయస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుచేయాలని తీర్మా నం పంపించినా స్పందన లేదని చెప్పారు.
కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇలా అసెంబ్లీ తీర్మానం చేయాలని బీజేపీకి సవాల్ విసిరారు. గత సమావేశాల్లో 9 రోజులు రైతుల కోసం పోరాడామని గుర్తుచేశారు. రైతులు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పక్షాన టీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీల ఎంపీలు పోరాడటం లేదన్నారు. కొందరు ఎంపీలు తాము మాట్లాడలేదని పేర్కొనటం వెనుక స్వార్థప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పారు. రాష్ట్రానికి చెందిన ఇతర పార్టీల ఎంపీలు ఒకసారైనా పార్లమెంట్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు దమ్ముంటే గురువారం తాము చేసే ఆందోళనలో కలిసి రావాలని సవాల్ విసిరారు.