హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఏడు దశాబ్దాల విలువైన కాలాన్ని ఈ రెండు పార్టీలు వృధా చేశాయని ధ్వజమెత్తారు. దేశంతో పాటు రాష్ట్రాల అభివృద్ధికి ఈ రెండు పార్టీలు ఆటంకంగా మారాయని సుమన్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ ఎల్పీలో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ పర్యటనకు రెండు జాతీయ పార్టీల నాయకులు వస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల జాతీయ నాయకులు తెలంగాణకు మేలు చేయడానికి రావడం లేదు.. దండయాత్రకే వస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని సుమన్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నిర్లక్ష్యమే కారణమన్నారు. 2000లో బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఉంటే ఇన్ని బలిదానాలు జరగకపోయేవని గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒప్పుకున్నప్పటికీ, నిర్లక్ష్యంగా వ్యవహరించి, వేలాది మంది చావులకు కారణమైందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విభజన చట్టం హామీలు అమలు చేయడంలో బీజేపీని నిలదీయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కేంద్రం దున్నపోతు ప్రభుత్వం అయితే.. దాని మీద ఈగ వాలకుండా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీనే అని సుమన్ విమర్శించారు.
తెలంగాణ పర్యటనకు వస్తున్న రాహుల్, జేపీ నడ్డా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. విభజన చట్టం హామీలపై బీజేపీ వైఖరి చెప్పిన తర్వాతే నడ్డా తెలంగాణలో అడుగు పెట్టాలన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీఐఆర్పై కూడా స్పందించాలన్నారు.
రాహుల్ గాంధీ చేతకాని తనమే బీజేపీని గెలిపిస్తోందని సుమన్ అన్నారు. బీజేపీని గెలిపిస్తున్న నాయకుడిగా రాహుల్ మారారని విమర్శించారు. రాజకీయాల నుంచి రిటైర్ అవుతాడా..? బీజేపీపై పోరాటంలో ఫైటర్గా మారుతాడో.. రాహుల్ తేల్చుకోవాలని సూచించారు. బీజేపీ ఎన్ని దారుణాలకు పాల్పడినా.. పోరాటం చేయాల్సిన చోట రాహుల్ చేయడం లేదన్నారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై రాహుల్ ఎందుకు పోరాటం చేయట్లేదని ప్రశ్నించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయ కార్యకలాపాలు రాహుల్ గాంధీ వస్తున్నారని నిషేధించలేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. జూన్ 2021 లోనే ఓయూలో రాజకీయ కార్యకలాపాలను నిషేధించారని గుర్తు చేశారు. యూనివర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాల నిషేధాన్ని హైకోర్టు కూడా సమర్ధించిందని తెలిపారు. ఉస్మానియా వీసీ బీసీ వర్గాలకు చెందిన వారు కనుకే కాంగ్రెస్ నేతలు ఆయనకు చీర గాజులు పంపారు. ఇది దారుణమని సుమన్ అన్నారు.
రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తే చీల్చి చెండాడుతామని బాల్క సుమన్ హెచ్చరించారు. ప్రజలే వారికి తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. రేవంత్, జగ్గారెడ్డిల అగ్రవర్ణ భావజాలాన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు గమనించాలని సూచించారు.