జైనథ్, ఫిబ్రవరి 5: సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసే కాంగ్రెస్, బీజేపీల నుంచి వందలాది మంది టీఆర్ఎస్లో చేరుతున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన చేరికల కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు.
ఎమ్మెల్యే సమక్షంలో దీపాయిగూడ, కూర, ఆనంద్పూర్ రాంపూర్, సాంగిడి, సుందరగిరి, మేడిగూడ గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 300 మంది యువకులు, మహిళలు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే భోరజ్ నుంచి జైనథ్ వరకు కార్యకర్తలతో కలిసి మోటర్ సైకిల్ నడుపుతూ వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ సర్కారు నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మొండిచేయి చూపిందన్నారు.
వ్యవసాయ చట్టాలతో కేంద్రం అన్నదాతకు అన్యాయం చేసిందన్నారు. మహిళలకు జీరో జన్ ధన్ బ్యాంకు ఖాతాల ద్వారా రూ.15 లక్షల చొప్పున డిపాజిట్ చేస్తామన్న ప్రధాని మోడీ మోసం చేశారన్నారు. సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించలేదన్నారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో జిల్లాకు తీరని అన్యాయం చేసిందన్నారు. మంత్రి కేటీఆర్ జిల్లాకు టెక్స్టైల్, ఐటీ టవర్ , ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్లు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు.
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. మండలంలోని ఆనంద్పూర్లో రాశిసీడ్ ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ప్లాంటు, వైకుంఠధామాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కల్యాణమండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందించిన రాశి సీడ్ వారు ఆదర్శనీయులని అభినందించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, రాశిసీడ్ కంపెనీ ప్రతినిధి విష్ణువర్ధన్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ మనోహర్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, ఎంపీపీ గోవర్ధన్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, రైతుబంధు మండల కన్వీనర్ లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు గోవర్ధన్రెడ్డి, పురుషోత్తం యాదవ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గణేశ్ యాదవ్, రైతుబంధు జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, సర్పంచులు ఊశన్న , రాధిక , దేవన్న , నాయకులు సాయినాథ్, నర్సింగు, స్వామి, బండిస్వామి, రవి, రూపేశ్, గణేశ్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.